నేరేడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత

5 Dec, 2020 06:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీకి మెజార్టీ దక్కలేదు. మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్‌ 55 డివిజన్లలో గెలుపొందగా, బీజేపీ 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది.‌ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది.106 చోట్ల పోటీ చేసిన టీడీపీకి.. ఒక్క స్థానంలో కూడా డిపాజిట్‌ దక్కలేదు. ఏ పార్టీ మేజిక్‌ ఫిగర్‌ సాధించకపోవడంతో హంగ్‌ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అతిపెద్ద పార్టీగా, 48 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాగా, స్వస్తిక్‌ గుర్తుపై నెలకొన్న వివాదం కారణంగా నేరెడ్‌మెట్ డివిజన్‌ ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. ఫలితం వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం లెక్కింపు నిలుపుదల చేశారు. రిటర్నింగ్ అధికారి.. ఎస్ఈసీకి నివేదిక పంపించారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు..
కుత్బుల్లాపూర్‌ (8): టీఆర్ఎస్‌-7, బీజేపీ-1
పటాన్‌చెరు (3): టీఆర్ఎస్ - 3
శేరిలింగంపల్లి (10): టీఆర్ఎస్‌-9, బీజేపీ-1
జూబ్లీహిల్స్‌ (7): టీఆర్ఎస్‌ - 4, ఎంఐఎం - 2, బీజేపీ -1
ముషీరాబాద్‌ (6): బీజేపీ-5, ఎంఐఎం-1
అంబర్‌పేట్‌ (5): బీజేపీ-3, టీఆర్ఎస్‌-2
గోషామహల్‌ (6): బీజేపీ-5, ఎంఐఎం-1
చార్మినార్ (5): ఎంఐఎం-5
చాంద్రాయణగుట్ట (7): ఎంఐఎం-6, బీజేపీ-1
బహదూర్‌పురా (6): ఎంఐఎం-6
యాకుత్‌పురా (7): ఎంఐఎం-5, బీజేపీ-2
మలక్‌పేట్‌ (6): ఎంఐఎం-4, బీజేపీ-2
మహేశ్వరం (2): బీజేపీ-2
ఉప్పల్‌ (10): టీఆర్ఎస్‌-6, బీజేపీ-2, కాంగ్రెస్-2
ఎల్బీనగర్‌ (11): బీజేపీ-11
రాజేంద్రనగర్ (5): ఎంఐఎం-2, బీజేపీ-3

మైలార్ దేవుపల్లి డివిజన్‌లో బీజేపీ విజయం
మైలార్ దేవుపల్లి డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. సమీప అభ్యర్థి మాజీ కార్పొరేటర్ ఎమ్మెల్యే సోదరుడు ప్రేమ్‌దాస్ గౌడ్‌పై గెలుపొందారు.

ఫలితం ఆశించినంతగా రాలేదు: కేటీఆర్‌
గ్రేటర్‌‌ ఫలితం తాము ఆశించిన ఫలితాలు రాలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మరో 20 సీట్లు ఎక్కువ వస్తాయని ఆశించామని అన్నారు. 12 డివిజన్లలో స్వల్ప తేడాతో ఓటమి చెందామన్నారు. ఫలితాలపై నిరాశ చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మేయర్‌ పీఠంపై కూర్చునేందుకు రెండు నెలల సమయం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.

మచ్చబొల్లారం డివిజన్‌లో వివాదం..
మచ్చబొల్లారం డివిజన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 36 ఓట్లతో తొలత టీఆర్‌ఎస్‌ గెలుపొందగా, రీ కౌంటింగ్‌ చేయాలంటూ బీజేపీ డిమాండ్‌ చేసింది. కౌంటింగ్‌ కేంద్రం ముందు బీజేపీ ఆందోళనకు దిగింది.

బీఎన్‌రెడ్డి నగర్‌లో టీఆర్‌ఎస్‌కు షాక్‌..
బీఎన్‌రెడ్డి నగర్‌లో టీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. డమ్మీ అభ్యర్థి కారణంగా టీఆర్‌ఎస్‌ పరాజయం పాలైంది. 32 ఓట్లు తేడాతో ఆ పార్టీ ఓడిపోయింది. టీఆర్‌ఎస్‌ డమ్మీ అభ్యర్థికి 39 ఓట్లు రాగా, 32 ఓట్లతో బీఎన్‌రెడ్డి నగర్‌ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా..
పీసీసీ అధ్యక్ష పదవికి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా. గ్రేటర్‌ ఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

జంగమెట్‌లో హోరాహోరీ..
జంగమెట్‌లో ఉత్కంఠ నెలకొంది. పోటీ హోరాహోరి కొనసాగుతుంది. 603 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ కొనసాగుతుంది. గతంలో జంగమెట్ ఎంఐఎం సిట్టింగ్ సీటు కాగా, అక్బరుద్ధిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రాయణ గుట్ట అసెంబ్లీ పరిధిలోనిది.

గోషామహల్‌లో ఆరు డివిజన్లు బీజేపీవే..
గోషామహల్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. బేగంబజార్ - శంకర్ యాదవ్, గోషామహల్ - లాల్ సింగ్, మంగళ్‌ హాట్ - శశి కళ, జాంబాగ్ - రాకేష్ జైస్వాల్, గన్ ఫౌండ్రి- డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్‌లు విజయం సాధించారు.

ప్రగతి భవన్‌కు సింధు ఆదర్శ్‌ రెడ్డి?
గ్రేటర్‌ ఎన్నికల్లో 59 డివిజన్లలో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌.. మేయర్‌ అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టింది. 111 డివిజన్‌ భారత్‌ నగర్‌లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింధు ఆదర్శ్‌ రెడ్డి ప్రగతి భవన్‌కు రావాలని పిలుపు అందుకున్నట్లు సమాచారం. కాగా సింధు ఆదర్శ్‌ రెడ్డి.. మెదక్‌ ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి కోడలు.

ఆల్విన్‌ కాలనీలో టీఆర్‌ఎస్‌ విజయం
ఆల్విన్ కాలనీ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్ 1249 ఓట్లతో గెలుపొందారు, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముద్దం నరసింహ యాదవ్ 7470 ఓట్లతో విజయం సాధించారు. అల్లాపూర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబిహా గౌసుద్దీన్ 10310 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఆ డివిజన్లలో బీజేపీ విజయం..
హయత్‌నగర్‌, నాగోల్‌, మాన్సూరాబాద్‌ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. హయత్ నగర్‌ డివిజన్‌లో కళ్లెం నవ జీవన్‌రెడ్డి, నాగోల్ డివిజన్‌లో చింతల అరుణ సురేందర్ యాదవ్‌, మాన్సూరాబాద్ డివిజన్‌లో కొప్పుల నర్సింహారెడ్డి గెలుపొందారు. మౌలాలి, మూసాపేట్‌ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మౌలాలి డివిజన్‌లో సునీత యదవ్‌, మూసాపేట్ డివిజన్‌లో కోడిచర్ల మహేందర్ గెలుపొందారు.

బీఎన్‌ రెడ్డి నగర్‌లో రీ కౌంటింగ్‌..
టీఆర్‌ఎస్‌ అభ్యర్థన మేరకు బీఎన్‌ రెడ్డి నగర్‌లో అధికారులు రీ కౌంటింగ్‌ జరుపుతున్నారు. 16 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే తమకు అనుమానం ఉందంటూ టీఆర్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్‌ కోరింది. దాంతో అధికారులు మళ్లీ కౌంటింగ్‌ జరుపుతున్నారు.

దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌..
గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దూసుకుపోతుంది. గోల్నాకా, మల్లాపూర్‌, ఫతేనగర్‌, సోమాజిగూడ, శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మల్లాపూర్‌లో పన్నాల దేవేందర్‌ రెడ్డి, ఫతేనగర్‌లో పండాల సతీష్‌ గౌడ్‌, సోమాజిగూడలో వనం సంగీత, శేరిలింగంపల్లిలో రాగం నాగేందర్ యాదవ్ గెలుపొందారు. గోల్నాకా డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దూసరి లావణ్య 2,716 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఎంఐఎం, బీజేపీల మధ్య ఘర్షణ..
జంగంమెట్ డివిజన్ కౌంటింగ్‌లో ఎంఐఎం, బీజేపి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉప్పుగుడా, జంగంమెట్‌లో బీజేపీ లీడ్‌ను జీర్ణించుకోలేకే దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిసున్నారు. దాడిలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, పోలీసుల ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. అడిషనల్ సీపీ చౌహన్, ఎస్పీ కోటిరెడ్డి అరోరా కళాశాలకు చేరుకున్నారు.

పోటాపోటీగా.. ఎంఐఎం-బీజేపీ 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఐంఎం, బీజేపీ పోటా పోటీగా దూసుకు వెళుతున్నాయి. ఇప్పటివరకూ ఎంఐఎం 31 డివిజన్లలో గెలుపొంది, 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కమల దళం కూడా 30 స్థానాలు కైవసం చేసుకుని 15 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఆ డివిజన్లలో బీజేపీ గెలుపు..
కొత్తపేట, సరూర్‌నగర్‌, గడ్డి అన్నారం, వినాయక్‌నగర్‌, రామంతపూర్‌ డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. కొత్తపేటలో నాగకోటి పవన్‌కుమార్‌, సరూర్‌నగర్‌లో ఆకుల శ్రీవాణి అంజన్‌, గడ్డి అన్నారంలో బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, వినాయక్‌నగర్‌లో రాజ్యలక్ష్మి, అమీర్‌పేటలో కేతినేని సరళ, రామంతపూర్‌లో బండారు శ్రీవాణి  గెలుపొందారు. చిలుకానగర్‌ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి గోనె శైలజ 200 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఖైరతాబాద్, కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ గెలుపు
గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతుంది. ఖైరతాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయారెడ్డి విజయం సాధించారు. కూకట్‌పల్లిలో జూపల్లి సత్యనారాయణ గెలుపొందారు. హస్తినపురంలో బీజేపీ అభ్యర్థి సుజాత నాయక్ 680 ఓట్లతో గెలుపొందారు. కె.పి.హెచ్‌.పీ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మందాడి శ్రీనివాసరావు 1540 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

వనస్థలిపురంలో బీజేపీ గెలుపు..
వనస్థలిపురం డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి రాగుల వెంకట్ రెడ్డి గెలుపొందారు. నాచారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శాంతి సాయిజన్‌, జగద్గిరిగుట్ట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జగన్‌ విజయం సాధించారు. హబ్సిగూడలో బీజేపీ అభ్యర్థి కే. చేతన గెలుపొందారు.

మేయర్‌ సతీమణి విజయం
గ్రేటర్‌ ఎన్నికల్లో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి బొంతు శ్రీదేవీ గెలుపొందారు. చర్లపల్లి డివిజన్‌ నుంచి  టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగిన ఆమె విజయం సాధించారు. ఇక 8వ డివిజన్ హబ్సిగూడ నుంచి పోటీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి  సుభాష్ రెడ్డి సతీమణి స్వప్నపై బిజెపి అభ్యర్థి చేతన గెలుపొందారు.

కూకట్‌పల్లి జోన్‌లో ఇరవై డివిజన్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కొనసాగుతుంది. 22 డివిజన్లకు 19 డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కూకట్‌పల్లి జోన్‌లో మూడు చోట్ల బీజేపీ ఆధిక్యం కొనసాగుతుంది. సోమాజిగూడ,చందానగర్‌, నేరెడ్‌మెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతుంది.

పటాన్‌చెరు, క్రాపాలో టీఆర్‌ఎస్‌ విజయం:
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పటాన్‌చెరు, కాప్రా డివిజన్లలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. పటాన్‌చెరులో కుమార్‌ యాదవ్‌, కాప్రాలో స్వర్ణరాజ్‌ విజయం సాధించారు.

ఏఎస్‌రావు నగర్‌, ఉప్పల్‌ ‘హస్త’గతం
గ్రేటర్‌ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ రెండు డివిజన్లను గెలుచుకుంది. ఏఎస్‌ రావు నగర్‌, ఉప్పల్‌ను ‘హస్త’గతం చేసుకుంది. ఏఎస్‌ రావు నగర్‌లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి, ఉప్పల్‌లో మందముల్లా రజిత విజయం సాధించారు.

చింతల్‌లో టీఆర్‌ఎస్‌లో విజయం
హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్‌ దూసుకుపోతుంది. చింతల్‌ డివిజన్‌లో ఆ పార్టీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ ఆభ్యర్థి రషీదా బేగం గెలుపొందారు.

అమీర్‌పేట్‌లో 960 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. మాదాపూర్‌లో 4,999 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్‌, మియాపూర్‌లో 1935 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్‌ కొనసాగుతుంది. రాజేంద్రనగర్‌లో 1614 ఓట్లతో  బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. గచ్చిబౌలిలో 1000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. మల్లాపూర్‌లో 1,841 ఓట్లు,  బాలాజీనగర్‌లో 7,501 ఓట్లతో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతుంది.

సనత్ నగర్‌లో కారు విజయం
సనత్‌ నగర్‌ డివిజన్‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కొలను లక్ష్మి రెడ్డి దాదాపు 2429 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు.

దత్తాత్రేయ నగర్‌లో ఎంఐఎం గెలుపు
పాతబస్తీలో ఎంఐఎం పార్టీ తన హవా కొనసాగిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి జాకిర్‌ బక్రీ గెలుపు దత్తాత్రేయ నగర్‌ డివిజన్‌లో విజయం సాధించారు.

భారతినగర్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు 
సంగారెడ్డి జిల్లా  భారతినగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి సుమారు 3900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

కుత్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ విజయం
టీఆర్‌ఎస్‌ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాతం సుమారు 2025 ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు.

రంగారెడ్డి నగర్‌లో టీఆర్ఎస్‌ గెలుపు
టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కొనసాగుతోంది. రంగారెడ్డి నగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి విజయ్‌శేఖర్ గౌడ్‌ విజయం సాధించారు. 

కూకట్‌పల్లి సర్కిల్‌లో అధికార టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. కూకట్‌పల్లి పరిధిలోని ఓల్డ్ బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి.. వివేకానందనగర్ కాలనీ,  హైదర్‌నగర్, అల్విన్ కాలనీలో కారుపార్టీ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది. 

బాలానగర్‌లో  టీఆర్‌ఎస్‌ గెలుపు 
బాలానగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపొందింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఆవుల రవీందర్‌రెడ్డి  విజయం సాధించారు.

చైతన్యపురిలో బీజేపీ విజయం
పలు డివిజన్లలో ఆధిక్యంలో ఉన్న బీజేపీ చైతన్యపురిలో గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి నర్సింహ గుప్తా  విజయం సాధించారు.

నవాబ్ సాహెబ్ కుంటలో ఎంఐఎం విజయం
ఎంఐఎం మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నవాబ్‌ సాహెబ్ ‌కుంట డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి షిరీన్ ఖాతూన్‌ గెలుపొందారు. ఇప్పటి వరకు ఏడు డివిజన్లలో విజయం సాధించింది.

రియాసత్‌నగర్‌లో ఎంఐఎసం విజయం: 
ఎంఐఎం పార్టీ రియాసత్‌ నగర్‌ డివిజన్‌లో గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి ముస్తఫా బేగ్‌  విజయం సాధించారు.

బార్కాస్‌లో ఎంఐఎం గెలుపు  
ఎంఐఎం గెలుపు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు డివిజన్లలో ఎంఐఎం గెలుపొంది. బార్కాస్‌లో ఎంఐఎం విజయం సాధిందిచి మరో డివిజన్‌ను తన ఖాతాలో వేసుకుంది. బార్కాస్‌లో ఎంఐఎం అభ్యర్థి షబానా బేగం విజయం సాధించారు.

ఆర్సీపురంలో టీఆర్‌ఎస్‌ విజయం
టీఆర్‌ఎస్‌ జోరు కొనసాగుతోంది. పలు డివిజన్లలో టీఆర్‌ఎస్‌  ఆధిక్యంతో ముందంజలో ఉంది. ఆర్సీపురంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుష్ప నగేష్‌యాదవ్‌ గెలుపొందారు. దీంతో టీఆర్‌ఎస్‌ ఖాతాలో నాలుగు డివిజన్లు చేరాయి. పుష్ప నగేష్‌ యాదవ్‌ సుమారు 5759 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.


బోరబండలో టీఆర్‌ఎస్‌ విజయం
బోరబండలో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపొందింది. డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ విజయం సాధించారు. దీంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

బీజేపీ తొలి గెలుపు..
పలు డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగిస్తున్న బీజేపీ బోణి కొట్టింది. మంగళ్‌హాట్‌ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి శశికళ గెలుపొందారు. పులు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది.
 
హైదర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు
నువ్వా నేనా అనే తరహాలో కొనసాగుతన్న ఎన్నికల కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్‌ మరో విజయం సాధించింది. హైదర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌​ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు విజయం సాధించారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలో మూడు డివిజన్లు చేరాయి.

అహ్మద్‌నగర్‌లో‌ ఎంఐఎం విజయం
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం తన హవా కోనసాగిస్తోంది. ఇప్పటికే మూడు డివిజన్లలో విజయం సాధించిన ఎంఐఎం మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. అహ్మద్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి రఫత్‌ సుల్తానా గెలుపొందారు. దీంతో ఇప్పటి వరకు ఎంఐఎం నాలుగు డివిజన్లను గెలుచుకొని ముందంజలో ఉంది. చాంద్రాయణగుట్టలో 10వేల ఓట్ల ఆధిక్యంలో ఎంఐఎం కొనసాగుతోంది.

టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. పలు డివిజన్లలో నువ్వా నేనా అనే తరహాలో ఆధిక్యం కొనసాగుతోంది. ఇప్పటికే మూడు డివిజన్లలో గెలుపు సొంతం చేసుకున్న మజ్లీస్‌ సైతం మరోసారి తన పట్టునిలుపుకుంటోంది. 

కిషన్‌బాగ్‌లో ఎంఐఎం అభ్యర్థి విజయం
హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ఫలితాల్లో కిషన్‌బాగ్‌లో  ఎంఐఎం విజయ సాధించింది. దీంతో ఎంఐఎం చెందిన మూడో గెలుపొందారు. ఈ డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి హుస్సేనీ పాషా  విజయం సాధించారు.

డబీర్‌పురాలో ఎంఐఎం అభ్యర్థి గెలుపు
డబీర్‌పురా డివిజన్‌లో ఎంఐఎం రెండో విజయం నమోదు చేసుకుంది. ఈ డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి అలందార్‌ హుస్సేన్‌ గెలుపొందారు. 

బార్కస్‌లో ఘర్షణ:
బార్కస్‌లో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 


కాంగ్రెస్‌ ఖాతాలో ఏఎస్‌ రావు నగర్‌
కాంగ్రెస్‌ పార్టీ బోణి కొట్టి ఏఎస్‌ రావు నగర్‌ డివిజన్‌లో విజయం సాధించింది. ఏఎస్‌ రావు నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపొందారు.

యూసఫ్‌గూడలో టీఆర్‌ఎస్‌ గెలుపు
ఉత్కంఠ రేపుతున్న జీహెచ్‌ఎంసీ కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ పలు డివిజన్లలో​ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తోంది. తాజాగా యూసఫ్‌గూడలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్ విజయం సాధించారు.

మెట్టుగూడలో​ టీఆర్‌ఎస్‌ గెలుపు
ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యంలో దూసుకుపోతుంది. మెట్టుగూడ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ తొలి విజయం నమోదు చేసుకుంది.  మెట్టుగూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాసూరి సునీత విజయం సాధించారు.

మెహిదిపట్నంలో ఎంఐఎం విజయం
జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి ఫలితం ఎంఐఎం ఖాతాలో చేరింది. మెహిదిపట్నం డివిజన్‌లో‌ ఎంఐఎం మొదటి విజయం నమోదు చేసుకుంది. ఇక్కడ పోలింగ్‌ శాతం తక్కువగా నమోదు కావటంతో తొలి రౌండ్‌లోనే ఫలితం తేలింది. మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ గెలుపొందారు.


తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
తొలి రౌండ్‌ ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు 31 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 15, ఎంఐఎం 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆర్సీపురం, పఠాన్‌చెరు, భారతీనగర్‌, చందానగర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి, బాలానగర్‌, హఫీజ్‌పేట్‌, హైదర్‌నగర్‌, చర్లపల్లి, కాప్రా, మీర్‌పేట్‌ హెచ్‌బీకాలనీ, రంగారెడ్డి, శేరిలింగంపల్లి, గాజులరామారం డివిజన్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇక బీజేపీ హయత్‌నగర్‌, ఆర్సీపురం, భారతీనగర్,‌ గోషామహల్‌, బేగంబజార్‌, హయత్‌నగర్‌, ఆర్సీపురం, భారతీనగర్ డివిజన్లలో ఆధిక్యం కొనసాగుతోంది.‌ ఏఎస్‌ రావు నగర్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఉత్తర్వులపై స్పందించిన ఎలక్షన్‌ కమిషన్‌
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఎలక్షన్ కమిషన్ లంచ్ మోషన్ దాఖలు చేయనుంది. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని, రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే స్వీకరించాలని విజ్ఞప్తి చేయనుంది. 

బీజేపీ ఆధిక్యం
ఓట్ల లెక్కింపులో భాగంగా మొత్తం 1926 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. అందులో పార్టీల వారిగా.. బీజేపీ 92, టీఆర్‌ఎస్‌ 33, కాంగ్రెస్‌ 4, ఎంఐఎం 15 డివిజన్లలో ఆధిక్యం సాధించాయి.

బీజేపీ అభ్యంతరం
జాంబాగ్‌ డివిజన్‌ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ డివిజన్‌లోని బూత్‌ నంబర్‌ 8లో పోలైన ఓట్లు 471 కాగా, బ్యాలెట్‌ బాక్సులో 257 ఓట్లు మాత్రమే ఉన్నాయని ఆరోపిస్తోంది.

తొలి రౌండ్‌ ఫలితాలపై ఉత్కంఠ
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిక్యం సాధించగా, టీఆర్‌ఎస్‌ రెండో స్థానంలో నిలిచింది. దీంతో తొలి రౌండ్‌ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీల వారిగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు.. బీజేపీ 87, టీఆర్‌ఎస్‌ 30, ఎంఐఎం 16, కాంగ్రెస్‌ 2 ఓట్లు వచ్చాయి. మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు: 1926 కాగా, అందు‌లో దాదాపు 40 శాతం చెల్లని ఓట్లు ఉ‍న్నాయి.

ఉత్తర్వులను తోసిపుచ్చిన హైకోర్టు
ఎన్నికల కౌటింగ్‌ జరుగుతున్న క్రమంలో  ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను  తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. స్వస్తిక్‌ గుర్తు ఉన్న ఓటును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవలని ఎన్నికల సంఘానికి హైకోర్టు అదేశం జారీ చేసింది. బీజేపీ నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. గెలుపు, ఓటముల దగ్గర మార్కింగ్‌ ఓట్లు ఉంటే.. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి తుది ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది.

వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని తదుపరి విచారణను సోమవారంకు హైకోర్టు వాయిదా వేసింది. పెన్నుతో టిక్‌పెట్టినా ఓటేసినట్లేనని ఎస్‌ఈసీ సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ వెంటనే ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ శ్రేణులు హైకోర్టులో హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

బీజేపీ, టీఆర్ఎస్‌ ఏజెంట్ల మధ్య ఘర్షణ
హయత్‌నగర్ కౌంటింగ్ సెంటర్‌ వద్ద గందరగోళం చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్‌ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పటికే బీజేపీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో ఆధిక్యం ప్రదర్శించగా, టీఆర్‌ఎస్‌ రెండో స్థానంలో ఉంది. 

బీజేపీకి పోస్టల్‌ బ్యాలెట్లో ఆధిక్యం
పోస్టల్‌ బ్యాలెట్లలో బీజేపీకి ఆధిక్యం ఉంది. మెజార్టీ డివిజన్లలో బీజేపీకే పోస్టల్ బ్యాలెట్లు దక్కాయి. పోస్టల్ బ్యాలెట్లలో రెండో స్థానంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది.‌

లెక్కింపు ప్రారంభం
ఉత్కంఠ నడుమ గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. తర్వాత బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌కు గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశముంది. పెన్నుతో టిక్‌ పెట్టినా ఓటేసినట్లేనని ఎస్‌ఈసీ సర్క్యూలర్‌ జారీ చేయడంతో ఉత్కంఠ నెలకొంది.

ఈసీ సర్క్యులర్‌పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
ఈసీ సర్క్యులర్‌పై హైకోర్టులో బీజేపీ హౌజ్‌మోషన్‌ పిటిషన్ దాఖలు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. పెన్నుతో టిక్‌ పెట్టినా ఓటేసినట్లేనని ఎస్‌ఈసీ సర్క్యూలర్‌ జారీ చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈసీ సర్క్యులర్‌ను అమలు చేస్తారా, లేదా అనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ఓట్ల లెక్కింపు కోసం 30 కౌంటింగ్ కేంద్రాల్లో 166 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్‌కు 14 టేబుళ్లతో కూడిన కౌంటింగ్‌ హాల్ ఉంటుంది. 16 డివిజన్లకు రెండు కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు. రౌండ్‌కు 14 వేల ఓట్లు లెక్కిస్తారు. తొలి రెండు రౌండ్లలోనే 136 డివిజన్ల ఫలితాలు వచ్చే అవకాశముంది. మూడోరౌండ్‌ తర్వాత 13 డివిజన్ల ఫలితాలు రానున్నాయి.

రెడీ.. కౌంట్‌..
అనివార్య కారణాల నేపథ్యంలో రీ– పోలింగ్‌ జరిగిన ఓల్డ్‌ మలక్‌పేట సహా జీహెచ్‌ఎంసీలో ఉన్న 150 డివిజన్ల లెక్కింపు మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న 30 కేంద్రాల్లో జరగనుంది. ఆయా ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ప్రాంతాలను సైతం కేటాయించారు. 

మరిన్ని వార్తలు