బస్తీమే సవాల్‌

13 Nov, 2020 08:41 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. శుక్రవారం అన్ని డివిజన్లలో తుది ఓటర్ల జాబితాలు అందుబాటులో ఉంచుతున్న యంత్రాంగం ఆదివారం (15వ తేదీ) ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. నోటిఫికేషన్‌– పోలింగ్‌ మధ్య కనీసం రెండువారాల గడువు ఉండాలన్న నిబంధన నేపథ్యంలో డిసెంబర్‌ మొదటి వారంలో 6వ తేదీ లోపునే ఏదో ఒకరోజు పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది. వాస్తవానికి 2021 ఫిబ్రవరి 10వ తేదీ వరకు ప్రస్తుత పాలకవర్గానికి గడువు ఉన్నా.. ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా డిసెంబర్‌ మాసమే అనుకూలమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

నగరంలో గురువారం నాటి పరిణామాలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. జీహెచ్‌ఎంసీ పీఠాన్ని మళ్లీ రికార్డు మెజారిటీతో చేజిక్కుంచుకునే దిశగా అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహం రూపొందిస్తుండగా, షహర్‌ హమారా.. మేయర్‌ హమారా నినాదంతో బీజేపీ దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్‌ఎంసీ పీఠాన్ని ఎక్కువ కాలం తమ గుప్పిట్లో ఉంచుకున్న కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ తన పట్టును తిరిగి సాధించుకునేందుకు ఎత్తులు వేయనుంది. ప్రతి ఎన్నికలో కీలకంగా మారిన ఎంఐఎం సైతం మేయర్‌ స్థానమే లక్ష్యంగా ముందుకు వెళ్లనుంది. గతంలో పలుమార్లు సొంతంగా, ఇతర పారీ్టలతో కలిసి మేయర్‌ పదవిని దక్కించుకున్న ఎంఐఎం ఈసారి సొంతంగా మరోసారి తమ జెండాను ఎగురవేసే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. 

ఇతరులు.. మేల్కొనే లోపే.. 
ప్రస్తుత పాలవర్గం గడువు ఫిబ్రవరి వరకు ఉన్నా.. మూడు మాసాల ముందుగానే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నగరంలో ఓవైపు అభివృద్ధిని మరోవైపు సంక్షేమాన్ని సైతం పరుగులు పెట్టించింది. నగరంలో 150 డివిజన్లలో పోటీ చేసేందుకు సిట్టింగ్‌ కార్పొరేటర్లతో పాటు కొత్తవారితో కూడిన జాబితాలను సైతం సిద్ధం చేసి ఎన్నికలకు సిద్ధమైంది. ఎంఐఎం సైతం ఎన్నికల కార్యాచరణను ఇప్పటికే రూపొందించుకుంది. ఇక భారతీయ జనతా పార్టీ ఇటీవలీ దుబ్బాక ఎన్నిక విజయంతో మంచి ఊపు మీద ఉన్నా.. వార్డు, డివిజన్‌ స్థాయి కసరత్తును ఇంకా పూర్తి చేయలేదు. కాంగ్రెస్‌ సైతం మెజారిటీ డివిజన్లలో విజయానికి ఆశించిన రీతిలో ప్రణాళికలు రూపొందించలేదు. ప్రధాన పారీ్టలు బరిలోకి దిగే వరకు తాము ఎన్నికల అంశాన్నే పూర్తి చేసే దిశగా టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

ఒకరు ఒక వార్డు నుంచే.. 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  ఒక అభ్యర్ధి ఒక డివిజన్‌ (వార్డు) నుంచి మాత్రమే పోటీ చేసేందుకు అర్హులని జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటు హక్కు ఉన్న అభ్యర్ధి ఏ డివిజన్‌ నుంచైనా పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేయవచ్చన్నారు. ఒక అభ్యర్ధి రెండు మూడు డివిజన్ల నుంచి నామినేషన్‌ దాఖలు చేసినప్పటికీ, ఉపసంహరణ గడువు నాటికి ఒక్క డివిజన్‌కు మించి ఉండరాదని తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ డివిజన్లలో ఉంటే, అన్నీ రద్దవుతాయన్నారు. పోటీ చేసేందుకు అర్హత ఉండదన్నారు.

జీహెచ్‌ఎంసీలో ఓటర్లు ఇలా..

► (మహిళలు)...35,46,731 

► (పురుషులు)...38,56,617 

 (ఇతరులు).. 669

►(మొత్తం)...74,04,017

► 150  (మొత్తం డివిజన్లు) 

► 76  (మహిళా కార్పొరేటర్లు)

ప్రస్తుతం పార్టీల వారీగా కార్పొరేటర్లు

► టీఆర్‌ఎస్‌    99 
►ఎంఐఎం    44 
►బీజేపీ    04 
►కాంగ్రెస్‌    02 
►టీడీపీ    01

సాక్షి, సిటీబ్యూరో: ఏటికేడాది అధికంగా ఉండే జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ రాబోయే (2021– 22) ఆరి్థక సంవత్సరానికి సంబంధించి తగ్గించారు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం బడ్జెట్‌ రూ.6,973.64 కోట్లు కాగా, కొత్త బడ్జెట్‌ను రూ.5,600 కోట్లకు కుదించారు. గత బడ్జెట్‌ను జీహెచ్‌ఎంసీ నిధులది.. ఇతర కార్పొరేషన్ల నుంచి వచ్చే నిధులది వేర్వేరుగా ‘ఎ’, ‘బి’లుగా ప్రకటించగా.. ఈసారి విభజన చూపకుండా ప్రతిపాదించారు. రూ.5,600 కోట్లతో గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ ముందుంచారు. జీహెచ్‌ఎంసీ నిధులకే సంబంధించి పరిశీలిస్తే మాత్రం ప్రస్తుతం నడుస్తున్న ఆరి్థక సంవత్సరానిది ప్రస్తుత ఆరి్థక సంవత్సర బడ్జెట్‌ రూ.5,380 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.2,226.23 కోట్లు ఖర్చయ్యాయి. బడ్జెట్‌లో అత్యధికంగా రూ.1582.51 కోట్లు రోడ్లు, పేవ్‌మెంట్లకే కేటాయించారు. ఆ తర్వాత ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌కు, గ్రీన్‌ బడ్జెట్‌కు ఎక్కువగా కేటాయించారు. అంటే రోడ్లు, హరిత కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇతర కార్పొరేషన్ల నుంచి వస్తాయనుకున్న నిధులు రాకపోవడంతో ఈసారి వాటిని చేర్చలేదని తెలుస్తోంది.  

అప్పులే గొప్పలు.. 
ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయంలో ఆస్తిపన్ను అంచనా రూ.1,850 కోట్లు కాగా, అప్పులు రూ.1,224.51 కోట్లు. అసైన్డ్‌ రెవెన్యూ ఆదాయంగా రూ.652.10 కోట్లు ప్రతిపాదించారు. బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు ఆదేశం అవసరం కావడంతో వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని పెద్దగా చూపలేదు.     2020– 21 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్‌ఎంసీ నిధులకు సంబంధించిన రూ.5,380 కోట్ల బడ్జెట్‌ను రూ.5,500 కోట్లుగా సవరిస్తూ ప్రతిపాదించారు. కొత్త బడ్జెట్‌ (2021–22)ను డిసెంబర్‌ 10వ తేదీలోగా స్టాండింగ్‌ కమిటీ ఆమోదించి 15వ తేదీలోగా పాలకమండలి ముందు ఉంచాలి. 2021 జనవరి 10వ తేదీలోగా జనరల్‌ బాడీ సమావేశంలో సమీక్షించాలి. ఫిబ్రవరి 20వ తేదీలోగా  కార్పొరేషన్‌ ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం  2021 మార్చి 7వ తేదీ వరకు ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించాలి. 

ఎస్లాబ్లిష్‌మెంట్‌...                          1226.91
నిర్వహణ ఖర్చులు...                    905.30 
ఇతర రెవెన్యూ ఖర్చులు...             281.79
రోడ్లు, పేవ్‌మెంట్లు....                    1582.51  
భూమి, భూ అభివృద్ధి....               445.19 
వరద కాలువలు....                     170.00
గ్రీన్‌బడ్జెట్...                           ‌    560.00 
వాటర్‌ సప్లై, సివరేజీ...                 131.87
ఇతర క్యాపిటల్‌ ఖర్చులు              296.43

మరిన్ని వార్తలు