నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: మేయర్‌

17 Feb, 2021 07:51 IST|Sakshi

 వరదలు రావొద్దన్నదే నా ఉద్దేశం

గ్రేటర్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి

సాక్షి, బంజారాహిల్స్‌: నగరంలో వందేళ్లలో ఎన్నడూ రానంత రికార్డు స్థాయిలో గత ఏడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో వరదలతో నగర జనజీవనం అతలాకుతమైంది. అంతటి భారీ వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుణ్ని వేడుకుంటానని చెప్పే క్రమంలో తన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాటలను వక్రీకరించి తప్పుడు సంకేతాలు వెళ్లేలా వైరల్‌ అవుతున్నాయన్నారు.

హైదరాబాద్‌ నగరంలో వరదలు రావొద్దు అనేది మాత్రమే తన మనోగతమని, మొత్తానికే వర్షాలు రావొద్దని కాదని ఆమె స్పష్టం చేశారు. ఇక షేక్‌పేట తహసీల్దార్‌ బదిలీ వ్యవహారంలో రాజకీయ ప్రమేయమేమీ లేదని చెప్పారు. తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్నారు. బదిలీలనేవి రెవెన్యూ శాఖ చూసుకుంటుందని, దాంట్లో తనకు ఎలాంటి పాత్ర లేదని మేయర్‌ విజయలక్ష్మి స్పష్టం చేశారు.
చదవండి: మేయర్‌ వ్యాఖ్యలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌ 
మేయర్‌ ఎన్నిక: వారు అలా.. వీరు ఇలా.. 

మరిన్ని వార్తలు