ముసాయిదాకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం

18 Dec, 2020 08:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి గత నెలలో రూ. 5600 కోట్లతో ప్రవేశపెట్టిన ముసాయిదా బడ్జెట్‌ను జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎలాంటి మార్పుచేర్పుల్లేకుండా యథాతథంగా ఆమోదించింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీకి వచ్చే ఆదాయంలో అత్యధికంగా 32 శాతం ఆస్తిపన్ను ద్వారా రూ. 1850 కోట్లు వస్తుందని అంచనా. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ముసాయిదా బడ్జెట్‌ను ఆమోదించారు. వీటిలో కొన్ని ముఖ్యాంశాలను కమిటీ ప్రస్తావించింది.  బల్దియా ముసాయిదా బడ్జెట్‌ను స్టాండింగ్‌ కమిటీ ఆమోదించిన నేపథ్యంలో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.

నాగోల్‌లోని ఫతుల్లాగూడలో 6.20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న శ్మశానవాటికల్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు రెండెకరాల చొప్పున శ్మశానవాటికలు. హిందువులకు విద్యుత్‌ దహనవాటిక. 
జీహెచ్‌ఎంసీ అధికారుకు పోస్ట్‌ పెయిడ్‌ 4జీ  జీఎస్‌ఎం వాయిస్‌ అండ్‌  డేటా సిమ్‌లు. 
కాప్రా సర్కిల్‌లో మూడు వరద కాల్వల నిర్మాణానికి రూ.3.60 కోట్లతో టెండర్లు 
మూడు ప్రాపర్టీ టాక్స్‌ ఇండెక్స్‌ నంబర్ల రద్దు.  
వివిధ మార్గాల్లో రహదారుల విస్తరణకు ఆస్తుల సేకరణ 
 మొత్తం 18 అంశాలను ఆమోదించినట్లు పేర్కొన్న జీహెచ్‌ఎంసీ కొన్నింటిని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. 

ఆపిల్‌పై చావని ఆశ! 
జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులకు కానుకలపై ఆశ చావలేదట్లుంది. మరో రెండు నెలల్లోగా కార్పొరేటర్ల పదవీ కాలమే ముగిసిపోనున్న తరుణంలో ఆపిల్‌  ఐఫోన్లను మళ్లీ తెరపైకి తెచ్చారు. 15 మంది స్టాండింగ్‌ కమిటీ సభ్యులతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్‌ సహా మొత్తం 17 ఆపిల్‌ ఐఫోన్ల (ప్రో మాక్స్‌–512జీబీ) కొనుగోలుకు రూ. 27,23,740 ఖర్చు చేసేందుకు స్టాండింగ్‌ కమిటీ ఎజెండాలో ఉంచారు. ఆమోద ముద్ర కూడా వేసినప్పటికీ.. అబ్బే ఆమోదం పొందలేదు. ప్రస్తుతం ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులో లేనందున వాయిదా వేశారనే ప్రచారం చేశారు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు ఆమోదం పొందినట్లే. 

22 శాతం నిధులు రూ. 1224.51 కోట్లు రుణాల ద్వారా తీసుకోనున్నారు. 17 శాతం నిధులు రూ. 1022.70 కోట్లు ఫీజులు, యూజర్‌ చార్జీల కింద రానున్నాయి 
⇔ 14 శాతం నిధులు రూ. 770.51 కోట్లు ప్లాన్‌ గ్రాంట్ల కింద రానున్నాయి 
13 శాతం నిధులు రూ. 652.10 కోట్లు అసైన్డ్‌  రెవెన్యూ కింద రానున్నాయి 
3 శాతం నిధులు రూ. 189.69 కోట్లు క్రమబద్ధీకరణ ఫీజుల కింద లభించనున్నాయి 
ఒక శాతం నిధులు రూ. 66.20 కోట్లు ఇతర రెవెన్యూ మార్గాల ద్వారా లభించనున్నాయి 
రూ. 22.84 కోట్లు కాంట్రిబూషన్‌ ద్వారా అందుతాయని అంచనా   

మరిన్ని వార్తలు