14 నుంచి గిరిజన రిజర్వేషన్‌ పోరు యాత్ర 

3 Sep, 2022 02:28 IST|Sakshi
పోరు యాత్ర పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు 

పంజగుట్ట (హైదరాబాద్‌): ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణ వచ్చిన తర్వాతే గిరిజనులు ఎక్కువగా నష్టపోయారని పలు గిరిజన సంఘాల నాయకులు, వక్తలు అభిప్రాయ పడ్డారు. గిరిజన సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 30వ తేదీ వరకు కొనసాగనున్న ‘గిరిజన రిజర్వేషన్‌ పోరుయాత్ర’ రెండవ విడత పోస్టర్, కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, జనసేన యూత్‌ వింగ్‌ నాయకులు సంపత్‌నాయక్, కార్పొరేటర్‌ నీల రవినాయక్, బీజేపీ నాయకురాలు బాబీ మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ దాన్ని తుంగలో తొక్కారని, ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్లలో ఎంతో మంది గిరిజన యువకులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.

1,200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే  కేసీఆర్‌ వారికి ఏం చేయకుండా పక్క రాష్ట్రాలకు వెళ్లి డబ్బులు పంచడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం తరహాలో రాష్ట్రంలో ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు, ట్యాంక్‌బండ్‌పై ఠానూ నాయక్‌ విగ్రహం ఏర్పా టు,  కర్ణాటక తరహాలో తాండా ఫైనాన్స్‌ అండ్‌ డెవ లప్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు