వరుస విషాదాలు.. హాస్టళ్లలో దారుణాలు.. అసలు ఏం జరుగుతోంది?

8 Sep, 2022 09:54 IST|Sakshi
ఐశ్వర్య (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి మంచిర్యాల/కాగజ్‌నగర్‌టౌన్‌: కుమురంభీం జిల్లాలో ఓ విద్యార్థిని జ్వరంతో మంగళవారం రాత్రి చనిపోయింది. కాగజ్‌నగర్‌ మండలం అంకుశాపూర్‌కు చెందిన శంకర్, నీలాబాయి దంపతుల పెద్ద కూతురు ఐశ్వర్య (14) కాగజ్‌నగర్‌ కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం తలనొప్పిగా ఉందని డ్యూటీ టీచర్‌కు చెబితే పెయిన్‌బామ్‌ రాసుకోమనడంతో, జండూబామ్‌ రాసుకుని నిద్రపోయిన ఐశ్వర్య ఉదయంఎంతకీ నిద్రలేవలేదు. నోరు, ముక్కు నుంచి నురగలు రావడంతో విద్యార్థులు డ్యూటీ టీచర్‌కు చెప్పారు.
చదవండి: ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్‌ ఘటన

సమాచారం అందుకున్న తండ్రి శంకర్‌ వచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఐశ్వర్య మృతిచెందిందని వైద్యులు తెలిపారు. బాలిక మరణవార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నాయకులు మృతదేహంతో హాస్టల్‌ ముందు 8గంటలపాటు ధర్నా చేశారు. కొందరు స్కూల్లోకి చొచ్చుకెళ్లి డీఈవో అశోక్‌ ముందే ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. డీఎస్పీ కరుణాకర్‌ ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

బాలిక మృతికి కారణమైన ఎస్‌వో స్వప్న, ఏఎన్‌ఎం భారతి, డ్యూటీ టీచర్‌ శ్రీలతను సస్పెండ్‌ చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశం తెలిపారు. విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియాగా రూ.15లక్షల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతోపాటు తక్షణ సాయం కింద రూ.50వేలు నగదు ప్రకటించడంతో బాధితులు ఆందోళన విరమించారు. కాగా, గత 15 రోజుల్లో జిల్లాలోని పలు గురుకులాల్లో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ఇందులో ఒకరు డిగ్రీ విద్యారి్థని. హాస్టళ్లపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం వల్లే ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

మరిన్ని వార్తలు