కస్తూర్బా పాఠశాలలో బాలిక మృతి.. ఉదయం టిఫిన్‌ తిన్న తర్వాత 

15 Feb, 2022 10:04 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: గరిడేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో సోమవారం విద్యార్థిని మృతిచెందింది. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..  మండలంలోని సోమ్లాతండా గ్రామానికి చెందిన గుగులోతు చంద్రు, లలిత దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె దివ్య(14) గరిడేపల్లిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో 8వ తరగతి చదువుతుంది. రోజుమాదిరిగా సోమవారం ఉదయం టిఫిన్‌ తిన్న తర్వాత దివ్య ఒక్కసారిగా కింద పడిపోయింది. విధుల్లో ఉన్న ఏఎన్‌ఎం ఇందిర, పీఈటీ ధనమ్మలు వెంటనే దివ్య తల్లిదండ్రులకు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం దగ్గరలోని ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బైక్‌పై తీసుకెళ్లగా అప్పటికీ ఇంకా తెరువలేదు.

దీంతో అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే దివ్య మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కాగా ఆదివారం సెలవు కావటంతో దివ్య తండ్రి చంద్రు పాఠశాలకు వచ్చి కుమార్తెని చూసి తన వెంట తెచ్చిన మిక్చర్‌(కారా) ఇచ్చి వెళ్లినట్లు తోటి విద్యార్థినులు తెలిపారు. ఉదయం దివ్య తండ్రి తెచ్చిన మిక్చర్‌ తిన్న అనంతరం కొద్దిసేపటికి ఈ సంఘటన జరిగినట్లు విద్యార్థినులు చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్‌ కార్తీక్, మండల విద్యాధికారి చత్రునాయక్, ఎంపీఓ లావణ్య పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దివ్య చనిపోయిన విషయంపై సిబ్బందిని, విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పజెప్పారు.
చదవండి: పిల్లలు పెద్దయ్యారు.. సఖ్యతగా మెలగడం కుదరదని చెప్పినా వినకపోవడంతో

ఈ విషయంపై కస్తూర్బా పాఠశాల నిర్వాహకురాలు శైలజ మాట్లాడుతూ.. దివ్య కళ్లు తిరిగి పడిపోయిన వెంటనే హాస్టల్‌లో ఉన్న సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి, విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా తీయకపోవడంతో హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే దివ్య చనిపోయినట్లు వైద్యులు తెలిపారని, ఆకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని అభిప్రాయాలను వైద్యులు వ్యక్తం చేసినట్లు ఆమె చెప్పారు. అంతకుముందు దివ్యకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆమె తెలిపారు.
చదవండి: మరణించిన టీచర్‌ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో..

మరిన్ని వార్తలు