వారికి వెంటనే ఉద్యోగాలివ్వాలి: ఆర్‌ కృష్ణయ్య 

13 Nov, 2021 01:44 IST|Sakshi

ఖైరతాబాద్‌(హైదరాబాద్‌): కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ కార్యాలయ ముట్టడిలో పాల్గొని ఆయన మాట్లాడారు. 2018లో పరీక్షలు రాసిన అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ను 2020లో కరోనా కారణంగా అర్ధంతరంగా వాయిదా వేశారని తెలిపారు.

కొన్ని జిల్లాల్లోనే అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇచ్చారన్నారు. పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వకుండా మళ్లీ ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారని విమర్శించారు. ఇది సరైంది కాదని, గతంలో ఎంపికైన వారికే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి దృష్టిసారించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని కోరారు.  

మరిన్ని వార్తలు