శంషాబాద్: బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. టీషర్ట్లో సైతం బంగారాన్ని తీసుకొచ్చి ఓ నిందితుడు బుధవారం పట్టుబడ్డాడు. దుబాయ్ నుంచి ఎఫ్జెడ్–8779 విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన కస్టమ్స్ అధికారులు అతన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అతడు ధరించిన టీషర్ట్కు పొర మాదిరిగా ఉన్న బంగారాన్ని గుర్తించారు. ఇందులోంచి 386 గ్రాముల బంగారం బయటపడింది. దీని విలువ రూ.19 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.