టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే చంపాలని అనిపిస్తోంది..!

3 Oct, 2022 14:56 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ నేతల్లో అవినీతి పెరిగింది 

అందుకే మావోయిస్టులు సీరియస్‌ 

వారు తలుచుకుంటే పది నిమిషాల్లో చంపి వెళ్లిపోతారు.. 

గోనె ప్రకాశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

విద్యానగర్‌ (కరీంనగర్‌): టీఆర్‌ఎస్‌ పాలనలో ఎంపీటీసీలు మొదలు.. ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అవినీతి అడ్డూఅదుపు లేకుండా పోయిందని, అందుకే మావోయిస్టుల హెచ్చరికలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశ్‌రావు అన్నారు. ఆదివారం కరీంనగర్‌ ప్రెస్‌భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ నాయకుల అవినీతి ఇలాగే సాగితే రానున్న రోజుల్లో ‘అన్నలు’వస్తారని, పది నిమిషాల్లో అందరినీ చంపేసి వెళ్లిపోతారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, మెడికల్‌ ఉద్యోగాల మాఫియాపై మావోయిస్టులు సీరియస్‌గా ఉన్నారని, వారు దాడి చేయాలనుకుంటే 10 నిమిషాల్లో పని పూర్తిచేసి బార్డర్‌ దాటి వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి అంతా సీఎం కేసీఆర్‌కు తెలిసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఓ మంత్రి బావ రూ.8కోట్ల ప్రాపర్టీని ఆక్రమించినప్పటికీ అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే తనకే చంపాలని అనిపిస్తోందని గోనె వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు