సామాజిక తెలంగాణే లక్ష్మణ్‌ బాపూజీ లక్ష్యం: కృష్ణయ్య 

27 Sep, 2021 02:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ పనిచేశారని, తెలంగాణ సమాజానికి మహోన్నత వ్యక్తిగా నిలిచిన బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. బాపూజీ 106వ జయంతి వేడుకలను ట్యాంక్‌బండ్‌ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.

అనంతరం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందడమే బాపూజీకి అసలైన నివాళి అని వ్యాఖ్యానించారు. అనంతరం జాతీయ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దాసు సురేశ్‌ మాట్లాడుతూ లక్ష్మణ్‌ బాపూజీని కొన్ని వర్గాలకు నాయకుడిని చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సంఘం నేతలు గుజ్జ కృష్ణ, వెంకటేశ్, జయంతి, ఉదయ్, అంజి, రాజు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు