మెడికల్‌ సీట్లలో కరోనా వారియర్స్‌ కోటా 

14 Jul, 2021 02:20 IST|Sakshi

దేశవ్యాప్తంగా 5 సీట్లు కేటాయించిన కేంద్రం

మొదలైన నీట్‌ దరఖాస్తు ప్రక్రియ.. సెపె్టంబర్‌ 12న నీట్‌ పరీక్ష

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్‌ సీట్లలో కోవిడ్‌ వారియర్స్‌ కోటాను కేంద్రం కల్పించింది. ఈ కోటా కింద మొత్తం 5 ఎంబీబీఎస్‌ సీట్లను రిజర్వ్‌ చేస్తారు. గతేడాది జరిగిన పరీక్షలో కూడా ఈ కోటాను కేంద్రం కల్పించింది. నీట్‌ పరీక్షలో అర్హత సాధించిన కోవిడ్‌ వారియర్స్‌ పిల్లలకు ఈ కోటా కింద మెడికల్‌ సీట్లలో రిజర్వేషన్‌ లభిస్తుంది. కరోనా సోకిన వారికి నేరుగా చికిత్స అందించే డాక్టర్లు, సిబ్బంది (ప్రభుత్వ/ ప్రైవేటు)ని కోవిడ్‌ వారియర్స్‌గా పరిగణిస్తారు. కాగా, రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నీట్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హయత్‌నగర్‌లోనూ పరీక్ష కేంద్రాలుంటాయి. నీట్‌ కోసం దరఖాస్తు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. వచ్చే నెల 6వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్‌ 8 నుంచి 12 వరకు సవరణలు చేసుకోవచ్చు. పరీక్షకు మూడు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల చేస్తారు.

నీట్‌ ముఖ్యాంశాలు..
నీట్‌ పరీక్ష సెప్టెంబర్‌ 12వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య జరుగుతుంది. మాతృ భాష భాషను ఎంచుకునే అభ్యర్థులకు వారి భాష, ఇంగ్లిష్‌లో పరీక్ష బుక్‌లెట్‌ ఇస్తారు. ఇంగ్లిష్‌ ఎంచుకునే వారికి ఆ భాషలోనే బుక్‌లెట్‌ ఉంటుంది. నీట్‌ ప్రవేశ పరీక్ష ఫీజు జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.1,500, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.1,400, ఎస్సీ, ఎస్టీ తదితరులకు రూ.800గా నిర్ణయించారు.

>
మరిన్ని వార్తలు