వీసీల నియామకాల్లో జాప్యమేల? 

4 Feb, 2021 01:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఏడాదిన్నరగా రెగ్యులర్‌ వైస్‌ చాన్స్‌లర్లు(వీసీ) లేరని, వెంటనే వీరి నియామకానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ లేఖ రాసినట్లు తెలిసింది. ఇటీవల వీసీలతో నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే వీలైనంత త్వరగా వీసీలను నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి 2019 నాటికే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్‌టీయూ, తెలుగు విశ్వవిద్యాలయం, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీ పోస్టులు ఖాళీ అయ్యాయి. అదే ఏడాది జూలైలో ఈ కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయగా, 984 దరఖాస్తులు వచ్చాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నియామకాల్లో జాప్యంపై గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సెర్చ్‌ కమిటీల సమావేశాలు త్వరగా నిర్వహించాలని, వీసీల నియామకాలూ వేగంగా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు