రక్తం వేగంగా అందించేందుకు త్వరలో యాప్‌ 

5 Sep, 2022 05:12 IST|Sakshi
‘చిరుభద్రత బీమా’ కార్డును ఆవిష్కరిస్తున్న గవర్నర్, చిరంజీవి తదితరులు 

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: అత్యవసరవేళ రక్తాన్ని వేగంగా అందించేందుకు యాప్‌ను తయారుచేసినట్లు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెల్లడించారు. దీని నిర్వహణలో స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుంటామన్నారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ తరపున 50సార్లు రక్తదానం చేసిన వారికి చిరు భద్రత పేరిట లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్డులను గవర్నర్‌ తమిళిసై చేతుల మీదుగా రాజ్‌భవన్‌లో ఆదివారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ రక్తదానం మహా దానమన్నారు. గతంలో రోగులకు రక్తం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు సైతం ముందుకు వచ్చేవారు కాదని, రక్తదానంపై అవగాహన పెరిగి ఇప్పుడు పరిస్థితులు మారాయని తెలిపారు. రెడ్‌క్రాస్‌ ద్వారా రక్తదాన కార్యక్రమాలు జరుగుతున్నాయని, రాజ్‌భవన్‌ సైతం ఈ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బ్లడ్‌బ్యాంక్‌ ద్వారా సేవలందిస్తున్న చిరంజీవిని గవర్నర్‌ తమిళిసై ప్రత్యేకంగా అభినందించారు.

రక్తాన్ని అదించేందుకు రూపొందించిన యాప్‌లో చిరంజీవి చారిటబుల్‌ ట్రస్టు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. అనంతరం సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల క్రితం రక్తం అందుబాటులో లేక మరణించిన వారిని చూసి తనకు బ్లడ్‌ బ్యాంక్‌ ఆలోచన వచ్చిందన్నారు. సమాజానికి ఉపయోగపడేందుకే చిరంజీవి చారిటబుల్‌ ట్రస్టు ద్వారా బ్లడ్‌ బ్యాంకును ప్రారంభించామని తెలిపారు.   

మరిన్ని వార్తలు