బోనమెత్తిన గవర్నర్‌ తమిళిసై

24 Jul, 2022 02:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శనివారం రాజ్‌భవన్‌లో ఆషాఢ మాసం బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. తన తలపై బోనం మోస్తూ రాజ్‌భవన్‌ పరివార్‌ సభ్యులతో కలిసి ఆమె అధికారిక నివాసం నుంచి రాజ్‌భవన్‌లో ఉన్న నల్లపోచమ్మ ఆలయానికి ఊరేగింపుగా వచ్చారు. అమ్మవారికి బోనం సమర్పించి పూజలు చేశారు. విశాలమైన రాజ్‌భవన్‌ సముదాయంలో జానపద గీతాల ఆలాపనతో బోనాల ఉత్సవాలను నిర్వహించడంతో అంతటా పండుగ శోభను సంతరించుకుంది.

మహంకాళి అమ్మవారి దివ్య ఆశీర్వాదంతో కోవిడ్‌–19 మహమ్మారి చాలావరకు అదుపులో ఉందని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. ప్రజలంతా సాధారణ జీవితానికి రావడంతో ఈ ఏడాది బోనాల పండుగను జరుపుకునేందుకు ప్రజలు నిర్భయంగా ఆలయాలకు తరలివస్తున్నారని పేర్కొన్నారు. దేశం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె రాజ్‌భవన్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ  గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు.  

మరిన్ని వార్తలు