మహిళల నైపుణ్యం అద్భుతం 

25 Feb, 2023 03:07 IST|Sakshi
స్టాళ్లను పరిశీలిస్తూ అక్కడే ఉన్న టోపీని ధరించి చిరునవ్వులు చిందిస్తున్న గవర్నర్‌ 

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ఖైరతాబాద్‌: చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు దేశానికి వెన్నెముకలాంటివని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. శుక్రవారం అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎలిప్‌) ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటుచేసిన ‘ఎలిప్‌ వికార్డ్‌’ ఎగ్జిబిషన్‌ను గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్టాళ్లలో అమ్మకానికి ఉంచిన ఉత్పత్తులను పరిశీలించి, మహిళలతో మాట్లాడారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని ముందుకు సాగుతారన్నారు. మహిళలు ఎంతో నైపుణ్యంతో తయారు చేసిన ఉత్పత్తులను ఒక్కచోటకు చేర్చి ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఉత్పత్తులన్నీ అద్భుతంగా ఉన్నాయన్నారు. ఎంఎస్‌ఎంఈకి అన్నివేళలా అండగా ఉంటామని, కోవిడ్‌ సమయంలోనూ ఎంఎస్‌ఎంఈ రుణాలను చెల్లించడం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో ఎలిప్‌ ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని, కార్యదర్శి వి.శ్రీదేవి, సహాయ కార్యదర్శి పల్లవి జోషి, కోషాధికారి మహాలక్ష్మి, ఎగ్జిబిషన్‌ చైర్‌పర్సన్‌ శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 26 వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.  

మరిన్ని వార్తలు