ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగిస్తోంది
ప్రధానికి వివరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా పనిచేయడమేకాకుండా, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా నిర్వహిస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కితాబిచ్చారు. కరోనాను అరికట్టేందుకు ప్రత్యేకంగా వార్రూమ్ను ఏర్పాటుచేసి, హైటెక్ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటోందని తెలిపారు. ఈ కొత్త విధానాన్ని, అనుభవాన్ని పుదుచ్చేరిలో ఉపయోగించుకున్నామని, తెలంగాణ, పుదుచ్చేరి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడటానికి ఇది తోడ్పడిందన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ఆమె ప్రధా ని మోదీతో భేటీ అయ్యారు. ఇందులో తెలంగాణ, పుదుచ్చేరికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై చర్చించారు.
అనంతరం తెలంగాణ భవన్లో గవర్నర్ మీడియాతో మాట్లాడారు. కరోనాను ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రధాని సమయానుకూలంగా తీసుకున్న చర్యలపై తెలంగాణ రాజ్భవన్, పుదుచ్చేరి రాజ్నివాస్ బృందాలతో కలిసి తాను ఎడిట్ చేసిన రెండు పుస్తకాలను మోదీకి అందించానని చెప్పారు. కోవిడ్ విపత్కర సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు మందులు, ఆక్సిజన్ సరఫరాతో పాటు కరోనా కట్టడికి సంబం ధించిన అన్ని సహాయ సహకారాలు అందాయన్నా రు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని పూర్వ విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నామని, తాము చదువుకున్న యూనివర్సిటీలకు పూర్వ విద్యార్థులు ఏదో రూపంలో సాయపడేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని గవర్నర్ తెలిపారు.