భారతీయ భాషలను కాపాడుకోవాలి: గవర్నర్‌ 

27 Aug, 2022 02:08 IST|Sakshi
డాక్టర్‌ సీఎంకే రెడ్డికి పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ 

నాంపల్లి (హైదరాబాద్‌): భారతీయ భాషలను కాపాడుకోవాలని, తాను తమిళనాడులో పుట్టినప్పటికీ తెలంగాణ సోదరిగా తెలుగు నేర్చుకుంటున్నానని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఆధ్వర్యంలో నందమూరి తారకరామారావు కళామందిరంలో ఏర్పాటు చేసిన సంస్కృతి పురస్కార ప్రదానోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆమె తమిళనాడులో తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షిస్తూ వాటి పరివ్యాప్తి కోసం కృషి చేస్తున్న ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు చిల్లకూరు ముద్దు కృష్ణారెడ్డికి సంస్కృతి పురస్కారాన్ని అందజేసి ప్రసంగించారు. మండలి వెంకటకృష్ణారావు తెలుగుభాషా ప్రేమికుడిగా, గాంధేయవాదిగా, ప్రజల మనిషిగా సమాజసేవ చేశారని, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన సంస్కృతి పురస్కారాన్ని కృష్ణారెడ్డికి అందజేయడం అభినందనీయం అన్నారు. కార్య క్రమంలో తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య కిషన్‌రావు, ఏపీ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఆచార్య వై.రెడ్డి శ్యామల  విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్, డాక్టర్‌ విజయ్‌పాల్‌ పాత్‌లోత్‌  తదితరులు పాల్గొన్నారు.  
 
 

మరిన్ని వార్తలు