మొక్కలు నాటి మంచి భవిష్యత్తునిద్దాం 

21 Jan, 2023 01:04 IST|Sakshi

నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ ప్లాజాలో 26 నుంచి నర్సరీ మేళా   

బ్రోచర్‌ ఆవిష్కరించిన హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం మనం మొక్కలు నాటి భావితరాల వాళ్లకు మంచి భవిష్యత్తు ఇద్దా మని ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపు నిచ్చారు. ఈనెల 26 నుంచి 30 వరకు నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ ప్లాజాలో గ్రాండ్‌ నర్సరీ మేళా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో నర్సరీ మేళా బ్రోచర్‌ను హరీశ్‌ ఆవిష్కరించి మాట్లాడారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ షో లో హార్టికల్చర్‌ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్‌ ఉత్పత్తులు, అగ్రికల్చర్‌ ఎనర్జీ సేవింగ్‌ టెక్నాలజీ, అగ్రికల్చర్‌ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్‌ ఇండస్ట్రీ ఉత్పత్తులు ప్రదర్శిస్తారని వివరించారు.

హైడ్రోఫోనిక్, టెర్రస్‌ గార్డెనింగ్, వర్టికల్‌ గార్డెనింగ్‌ వంటి నూతన టెక్నాలజీ ఈ షోలో ప్రదర్శిస్తారని, దేశవ్యాప్తంగా 150కుపైగా నర్సరీ స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. ప్రధానంగా డార్జిలింగ్, హరియాణా, ముంబై, బెంగళూరు, పుణే, షిర్డీ, కడియం, చెన్నై, తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచి వచ్చిన ప్లాంట్స్‌ ప్రదర్శిస్తారన్నారు. మేళా ఇన్‌చార్జి ఖాలీద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ మేళా ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.  

మరిన్ని వార్తలు