లైట్‌ తీసుకుంటే..ముప్పు ముందరే

5 Apr, 2021 08:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

∙కోవిడ్‌ టెస్టులు, చికిత్సలను తేలిగ్గా తీసుకుంటున్న సిటీజనులు 

∙తీరా పరిస్థితి విషమించిన తర్వాత ఆస్పత్రికి తరలింపు 

∙వైరస్‌లోడ్‌ కారణంగా తగ్గిన రికవరీ రేటు.. 

∙వెంటిలేర్‌పై 1165 మంది,ఆక్సిజన్‌పై 1940 మంది 

∙సాధారణ వార్డుల్లో 952 మందికి చికిత్సలు 

∙హోం ఐసోలేషన్‌లో 4910 మంది

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో చాలా మంది ప్రజలు కరోనా వైరస్‌ను లైట్‌గా తీసుకుంటున్నారు. ఇప్పటికే తమకు కోవిడ్‌ వచ్చిపోయి ఉంటుందని, యాంటిబాడీస్‌ కూడా పుష్కలంగా వృద్ధి చెంది ఉంటాయని అపోహ పడుతున్నారు. వైరస్‌ తమను ఏమీ చేయలేదనే ధీమాతో కనీసం మాస్క్‌ కూడా ధరించడం లేదు. భౌతిక దూరం, శానిటైజర్ల వినియోగం మర్చిపోయారు. ఫలితంగా ఒకరి తర్వాత మరొకరు వైరస్‌ కోరల్లో చిక్కుకుంటున్నారు. టెస్టులు సహా చికిత్సలను నిర్లక్ష్యం చేస్తూ, తీరా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తిన తర్వాత ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారిని వైద్యులు వెంటిలేటర్‌పైకి తరలించాల్సి వస్తుంది. ప్రస్తుతం 1165 మంది వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 1940 మంది ఆక్సిజన్‌పై, 952 మంది సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. 4910 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. విధిగా కోవిడ్‌ నిబంధనలు పాటించడం, టీకా వేయించుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.    
విధిగా టీకా వేయించుకోవాలి 
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వైరస్‌ రూపాంతరం చెందుతోంది. గతంతో పోలిస్తే ఈసారి వైరస్‌ తీవ్రత కొంత ఎక్కువగా ఉంది. వైరస్‌లోడ్‌ అధికంగా ఉండటంతో రికవరీ రేటు కూడా తక్కువగా ఉంది. గతంలో వారం, రెండు వారాలకే కోలుకున్న వారు..ప్రస్తుతం మూడు వారాలైనా కోలుకోవడం లేదు. ఇలాంటి వారికి హై డోస్‌ యాంటీ బయాటిక్స్‌ వాడాల్సివస్తోంది. వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్‌ టీకా వేయించుకోవాలిని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌ రాజారాం అన్నారు.
( చదవండి: వామ్మోకరోనా.. కంటి చూపు కోల్పోతున్నారు!

మరిన్ని వార్తలు