తెలంగాణ రాష్ట్రానికి గ్రీన్‌ చాంపియన్‌ అవార్డు 

23 Oct, 2022 09:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక సంస్థ ‘ది ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌’ (ఐజీబీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్‌ చాంపియన్‌ అవార్డును అందజేసింది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈనెల 20 నుంచి శనివారం వరకు ‘గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌–2022’ సదస్సు జరిగింది. ఇందులో కౌన్సిల్‌ ప్రతినిధులు ప్రభుత్వ ఎంఏయూడీ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీప్లానర్‌ దేవేందర్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. గ్రీన్‌ బిల్డింగ్‌ ఫుట్‌ప్రింట్‌లోనూ ఇంధన పొదుపును పాటించడంలోనూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉంది. కూల్‌ రూఫింగ్‌ పాలసీని అవలంభిస్తూ విద్యుత్‌ వినియోగాన్ని కూడా తగ్గించింది. కాగా, గ్రీన్‌బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకెళ్లేందుకు మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. 

‘గ్రీన్‌ బిల్డింగ్‌’ నిబంధనలతో పారిశ్రామికవాడలు 
రాష్ట్రంలో హరిత పారిశ్రామికవాడల ఏర్పాటుకు ఐజీబీసీతో తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతు ల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) శనివారం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గ్రీన్‌బిల్డింగ్‌ కాంగ్రెస్‌–2022 జాతీయ సదస్సులో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. టీఎస్‌ఐఐసీ వైస్‌చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో గ్రీన్‌ బిల్డింగ్‌ విధానాలు, గ్రీన్‌ సిటీస్‌ ఏర్పాటును ప్రోత్స హించేందుకు ఐజీబీసీతో కుదిరిన ఒప్పందం దోహదం చేస్తుందని నర్సింహారెడ్డి వెల్లడించారు. 40 కొత్త పారిశ్రామికవాడలను రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో ఐజీబీసీ నేషనల్‌ చైర్మన్‌ గుర్మిత్‌సింగ్‌ అరోరా, హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ సీఈ శ్యాంసుందర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు