గ్రూప్‌–1, 2 ఇంటర్వ్యూలకు గుడ్‌బై?

8 Apr, 2022 09:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగ నియామక ప్రక్రియలో సంస్కరణలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం రాత పరీక్షతోనే అభ్యర్థులను ఎంపిక చేసి నియామకాలు చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇంటర్వ్యూ(మౌఖిక పరీక్ష)లకు స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఇలా అయితే, ఉద్యోగ నియామకాల క్రతువు వేగంగా పూర్తి అవుతుందని, పొరపాట్లకు, ఆరోపణలకు ఆస్కారం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు గ్రూప్‌–2, అంతకంటే తక్కువస్థాయి ఉద్యోగ నియామకాలు మాత్రమే చేపట్టింది. నూతన రాష్ట్రంలో ఇప్పటివరకు గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ వెలువడలేదు. ఈ నేపథ్యంలో సంస్కరణలతో నియామకాల ప్రక్రియ చేపట్టి నూతన ఒరవడిలో సాగవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.

ప్రిలిమ్స్, మెయిన్స్‌ మాత్రమేనా....
ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్‌–1 నియామకాల ప్రక్రియ 3 అం చెల్లో సాగింది. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించేవారు. అనంత రం మెరిట్‌ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేవారు. ఇప్పటివరకు గ్రూప్‌–2లో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గ్రూప్‌–1, గ్రూప్‌– 2ల సిల బస్, పరీక్షల విధానంపై ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఒకవేళ ఇంటర్వ్యూలను రద్దు చేస్తే సిలబస్‌లో ఏమైనా మార్పులుంటాయా అనే సందేహాలు కూడా వ్యక్తమ వుతున్నాయి.

సిలబస్‌లో మార్పు చేస్తే నోటిఫికేషన్ల జారీ మరింత ఆలస్యమయ్యే అవకాశముం దని, నూతన సిలబస్‌ ఎంపిక, మెటీరియల్‌ ఫైనలైజేషన్‌ కొలిక్కి రావడానికి సమ యం పట్టవచ్చని పలువురు భావి స్తున్నారు. అయితే సిల బస్‌లో పెద్దగా మార్పులు లేకుండా ఇంటర్వ్యూలకు సంబం ధించిన అంశాలను కూడా ప్రిలిమ్స్, మెయిన్స్‌ రాతపరీక్షల్లో కవరయ్యే విధంగా కాస్త మార్పులు చేస్తే సరిపోతుందని సర్వీసు నిబంధనలపై పట్టున్న ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.

పొరుగు రాష్ట్రంలో రద్దు
గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఇంటర్వ్యూలను రద్దు చేయాలని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అక్కడ గత ప్రభుత్వంలోని పెద్దలు, కొందరు అధికారులు ఇంటర్వ్యూ ప్రక్రియను ఆసరాగా చేసు కుని ఇష్టానుసారంగా మార్కులు కేటాయించిన అంశం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో పారదర్శకత పాటించే విధంగా అక్కడి ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దుచేయాలని భావించింది. ఉత్తరాదిలో మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నియామకాలను వేగంగా చేపట్టే లక్ష్యంతో సంస్కరణలు తీసుకురావడం శుభ పరిణామమని నిరుద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

(చదవండి: రైళ్లు ఢీకొనకుండా...ఆటోమెటిక్‌ ట్రెయిన్‌ ప్రొటెక్షన్‌ సిస్టం ‘కవచ్‌’)

మరిన్ని వార్తలు