తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం

11 Mar, 2022 04:46 IST|Sakshi
‘పల్లెప్రగతి డైరీ–2022’ని ఆవిష్కరిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి తదితరులు

‘పల్లెప్రగతి డైరీ–2022’ని ఆవిష్కరించిన హరీశ్, ఎర్రబెల్లి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా, తలమానికంగా నిలుస్తున్నాయని మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, అధికారులు, ఉద్యోగులు రూపొందించిన ‘పల్లెప్రగతి డైరీ–2022’ని గురువారం శాసనమండలి ఆవరణలో వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాత్ర అభినందనీయమన్నారు.

నేడు పల్లెలు పచ్చగా ఉన్నా యంటే ఈ శాఖల అధికారులు, ఉద్యోగులే కారణమని ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం వల్లే కేంద్ర ప్రభుత్వ అవార్డులు, రివార్డులు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలవడానికి కూడా వారే కారణమన్నారు. పల్లెప్రగతి పేరుతో డైరీ తేవడం, అందులో నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ ప్రకృతి వనాల చిత్రాలు ఏరి కూర్చారని మంత్రులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పీఆర్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ శరత్, డిప్యూటీ కమిషనర్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు