మెరూన్‌ పాస్‌బుక్‌ ఇవ్వకండి

14 Nov, 2020 08:35 IST|Sakshi

షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఆస్తుల హక్కుల ధ్రువీకరణ చేయకండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. తదుపరి విచారణ 19న

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గిరిజన (షెడ్యూల్డ్‌) ప్రాంతాల్లో 1/70 చట్టం వచ్చిన తర్వాత చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన యాజమాన్య హక్కును ధృవీకరించేలా మెరూన్‌ పాస్‌బుక్స్‌తోపాటు ఇతర పాస్‌బుక్స్‌ ఏవీ ఇవ్వరాదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌తోపాటు మరొకరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. చదవండి:  (‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎందుకు? )

సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం వచ్చిన తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీ్దకరించేలా ప్రభుత్వం మెరూన్‌ పాస్‌బుక్స్‌ మంజూరు చేస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది పీవీ రమణ నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని, గడువు ఇవ్వాలని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ అభ్యర్థించగా, తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌లో పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌లతోపాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూలు జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. 

>
మరిన్ని వార్తలు