కు.ని. మరణాలపై ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ వచ్చాకే..

4 Sep, 2022 02:05 IST|Sakshi

ఇబ్రహీంపట్నం ఘటనపై ప్రభుత్వానికి నివేదిక 

ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు

సాక్షి, హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో డీపీఎల్‌ ఆపరేషన్ల ఘటనపై విచారణ అత్యంత పారదర్శ కంగా చేస్తున్నట్లు ప్రజారోగ్య విభాగంసంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాతే తుది నివేదికను రూపొందించనున్నట్లు వివరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకు నేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నా రు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. దురదృష్టవశాత్తూ తొలిసారిగా ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయా రని, ఇది అత్యంత బాధాకరమని అన్నా రు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుందని, సర్జరీలు నిర్వహించిన ఆస్పత్రి వైద్య విధాన పరి షత్‌ పరిధిలో ఉండగా, ఫ్యామిలీ ప్లానింగ్‌ ప్రోగ్రాం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్‌ పరిధిలో ఉందన్నారు.

ఈ నేపథ్యంలో విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం, ఆ రెండు విభాగాలకు కాకుండా ప్రజారోగ్య విభాగానికి విచారణ బాధ్యతలను అప్పగించిందని పేర్కొన్నా రు. ప్రాథమిక చర్యల్లో భాగంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేసినట్లు వివరించారు. అదేవిధంగా చికిత్స చేసిన వైద్యుడికి తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ నోటీసులు ఇచ్చిందని, వైద్యుడి లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేశామని వెల్లడించారు.

స్టెరిలైజేషన్‌లో జరిగిన లోపాల వల్లే బాధి తులు ఇన్ఫెక్షన్‌కు గురైనట్లు ప్రాథమికంగా భావి స్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఆ నివేదికను మీడియాకు సైతం ఇస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చర్య లు తీసుకోవాలని ప్రభుత్వం కుటుంబ సంక్షేమ కమిషనర్‌ను ఆదేశించిందన్నారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాంపులో చికిత్స చేయించు కున్న మిగతా వారిని నిమ్స్, అపోలో ఆస్పత్రులకు తరలించి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు వివ రించారు. వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అక్కడ వైద్యాధికారులను నియమించిందని, చికిత్స పొందుతున్న వారంతా ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉండగా, ఇప్పటికే 12 మందిని డిశ్చార్జ్‌ చేశామని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో మిగతావారిని కూడా డిశ్చార్జ్‌ చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. 

మరిన్ని వార్తలు