TS: మరో రెండు రోజులు భారీ వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్‌!

19 Mar, 2023 20:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అకాల వర్షం రైతన్నలకు తీరని నష్టం కలిగించింది. అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. అయితే, మరో రెండు రోజులు కూడా తెలంగాణ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 

రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, ఆదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో  వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని వెల్లడించింది.

అలాగే, సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక, ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 156 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే కరీంనగర్‌, పెద్దపల్లి, మెదక్‌, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్‌, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

>
మరిన్ని వార్తలు