వరదతో టెన్షన్‌.. టెన్షన్‌.. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన  

23 Jul, 2021 09:56 IST|Sakshi

సాక్షి,చౌటుప్పల్‌(నల్లగొండ): పట్టణ కేంద్రంలోని ఊరచెరువు నిండుకుండలా మారడంతో పట్టణ వాసులో టెన్షన్‌ నెలకొంది.  మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి వరద వస్తుండడతో అలుగుపోస్తుంది. ఇప్పటికీ వర్షాలు తగ్గకపోవడంతో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణంలోనైనా వరదలు సంభవించొచ్చని భావిస్తున్నారు. 2005 అక్టోబర్‌ నెలలో వచ్చిన భారీ వర్షాలతో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సగానికిపైగా ఊరు, దుకాణాలు దెబ్బతిన్నాయి.

గతేడాది అక్టోబరు 13న కురిసిన వర్షాల కారణంగా వరదలు సంభవించి చెరువు అలుగు నుంచి వలిగొండ రోడ్డు వైపుకు, శ్రీవాణి హోటల్‌ నుంచి మల్లికార్జున స్కూల్‌ ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇప్పడు మరోసారి వర్షం అధికమై వరద పెరిగితే నీరు సర్వీస్‌ రోడ్‌ మీదుగా వెళ్తుందని లోతట్టు ప్రాంత ప్రజలు, దుకాణదారులు,చిరువ్యాపారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

అప్రమత్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు.. 
గతేడాది అనుభవంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా స్థానిక ఆర్డీఓ సాల్వేరు సూరజ్‌కుమార్‌ ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ అధికారులతో మాట్లాడుతున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చెరువు, అలుగు ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద నీటితో ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. అదే విధంగా కమిషనర్‌ కోమటిరెడ్డి నర్సింహరెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్, కౌన్సిలర్లు, సైతం తమ వంతుగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రత్యామ్నాయంగా కాల్వలు తవ్విస్తూ వరద ముప్పు లేకుండా చూస్తున్నారు.   

మరిన్ని వార్తలు