రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు..
పొంగిపొర్లుతున్న వాగులు.. అలుగు దుంకుతున్న చెరువులు
లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఊర్లకు రాకపోకలు బంద్
హైదరాబాద్లో కుంభవృష్టి.. రాష్ట్రంపై కొనసాగుతున్నఉపరితల ఆవర్తనం.. చురుగ్గా రుతుపవనాలు
మరో రెండురోజుల పాటు విస్తారంగా వానలు
పలుచోట్ల కుండపోత
ఐదు జిల్లాల్లో అప్రమత్తం
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వానలు పడే అవకాశం ఉందని.. ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. చెరువులు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరి జనం ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజుల కింద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోపాటు ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుత నైరుతి సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 36.9 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 2.67 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా హైదరాబాద్లో 8.17 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు ప్రకటించింది.
జిల్లాల్లో వానలే వానలు..
వాగులో చిక్కుకుని.. సురక్షితంగా బయటపడి
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం–ఎఖీన్పూర్ గ్రామాల మధ్య వాగులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోగా.. పోలీసులు ఫైర్ రెస్క్యూ టీం, గ్రామస్తులతో కలిసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
తెగిన చెరువు కట్ట
భారీవర్షంతో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో చెరువు కట్ట తెగిపోవడంతో పెద్దవాగు పొంగిపొర్లింది. సాతారంలో శివార్లలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఏడుగురు, వేంపల్లిలో మరొకరు వాగులో చిక్కుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు గజ ఈతగాళ్లు, తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.