హైదరాబాద్‌లో హై అలర్ట్‌..

13 Oct, 2020 02:19 IST|Sakshi
సికింద్రాబాద్‌లోని కార్ఖానా వద్ద వాన నీటిలో ఇబ్బందిపడుతున్న వాహనదారులు

4 రోజులుగాభారీ వర్షాలు

అన్ని జిల్లాల్లో అక్టోబర్‌ నెల సాధారణ స్థాయికి చేరువలో వర్షపాతం

నేడు, రేపు పలుచోట్ల  భారీ వర్షాలు

గోడ కూలి ఆరేళ్ల చిన్నారి మృత్యువాత

శిథిల భవనాల్లో ఉండే వారిని ఖాళీ చేయించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని వాన లతో ముంచెత్తుతున్నాయి. సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు గడవకముందే నెల సాధారణ వర్షపాతం రికార్డును బ్రేక్‌ చేస్తున్నాయి. వరు సగా నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మరోపక్క బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారడంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవు తున్నాయి. దీని ప్రభావంతో మంగళ, బుధ వారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, గ్రేటర్‌ హైదరాబాద్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు.

ఈ ఏడాది నైరుతి రుతుపవ నాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు చెరువులు, కుంటలు నిండి అలుగెత్తగా, ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. సీజన్‌లో సాధారణం కంటే 45 శాతం అధి కంగా వర్షాలు కురిశాయి. అక్టోబర్‌ 1 నుంచి ఈశాన్య రుతుపవనాల సీజన్‌ మొదలుకాగా, 4 రోజుల నుంచి రాష్ట్రంలో వానలు జోరుగా కురుస్తున్నాయి. అక్టోబర్‌లో రాష్ట్రంలో సగటున 9.55 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా సోమవారం ఉద యానికి 4.79 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వానల జోరు చూస్తుంటే మరో నాలుగైదు రోజుల్లో సాధారణ వర్షపాతాన్ని దాటే పరిస్థితి కనిపిస్తోంది. 

జిల్లాలవారీగా ఇలా..
రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి సోమ వారం ఉదయం నాటికి 1.34 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 3.88 సెం.మీ., సంగారెడ్డిలో 3.53, మెదక్‌లో 3.3, జోగుళాంబ గద్వాలలో 3.29, నారాయణపేటలో 2.92, కామారెడ్డిలో 2.47, జయశంకర్‌ భూపాలపల్లిలో 2.0, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో ఒక సెంటీమీటరు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలను విడుదల చేసింది. ఇప్పటివరకు 12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 13 జిల్లాల్లో అధికం, 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 

తిమ్మాజీపేటలో అత్యధికంగా 7 సెం.మీ.
నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేటలో సోమ వారం ఏకంగా 7 సెం.మీ. వర్షపాతం నమోదైం ది. వనపర్తి జిల్లా మదనాపూర్‌లో 6.6, గోపాల్‌ పేటలో 6.2, కొత్తకోటలో 4.9, గ్రేటర్‌ హైదరా బాద్‌ పరిధిలోని కాప్రాలో 4.6, మెదక్‌ జిల్లా టేక్మాల్‌లో 4.4, పీర్జాదిగూడలో 4.2, ఉప్పల్‌లో 4.1, ఓయూలో 4.0, చర్లపల్లి, బేగంపేటలో 3.8 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

గ్రేటర్‌ పరిధిలో కుండపోత
సోమవారం గ్రేటర్‌ పరిధిలో పలుచోట్ల కుండ పోత వానలు కురిశాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జడివాన కురవడంతో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై నడుములో తున వాననీరు పోటెత్తింది. సగటున 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ముంపు సమస్యలపై డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ బృందాలు లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. భారీ మోటార్లతో వరదనీటిని తోడాయి. రాగల 24 గంటల్లో వాయుగుండం ప్రభావంతో నగరంలో కుండపోత వాన కురవొచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికతో బల్దియా హై అలర్ట్‌ ప్రకటించింది. సిబ్బందిని, అధికారులను అప్రమత్తం చేసింది. ఎడతెరిపి లేని వర్షానికి రాంనగర్‌ డివిజన్‌ సంజయ్‌నగర్‌బస్తీలో గోడ కూలి జయశ్రీ అనే ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శిథిల భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణం సురక్షిత షెల్టర్లకు తరలించాలని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ బల్దియా అధికారులను ఆదేశించారు.

జంటజలాశయాలకు భారీగా వరదనీరు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నగరానికి ఆనుకొని ఉన్న జంటజలాశయాలు ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌సాగర్‌ నిండుకుండల య్యా యి. సోమవారం నాటికి ఉస్మాన్‌సాగర్‌ (గండి పేట)లో గరిష్టమట్టం 1,790 అడుగులకు గాను 1,773.182 అడుగుల మేర నీరు చేరింది. ఈ జలాశయానికి 1,388 క్యూసెక్కుల వరద నీరు చేరినట్లు జలమండలి ప్రకటించింది. దీని పక్కనే ఉన్న హిమాయత్‌సాగర్‌ గరిష్టమట్టం 1,763.50 అడుగులకు ప్రస్తుతం 1,762 అడుగుల మేర నిల్వలున్నాయి. ఈ జలాశయానికి 1,666 క్యూò Üక్కుల వరదనీరు చేరుతోందని అధికారులు తెలిపారు. ఈ జలాశయం నీటిమట్టం 1,763 అడుగులకు చేరిన వెంటనే గేట్లను ఎత్తి మూసీలోకి వరదనీటిని వదిలిపెడతామని జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు. గేట్లను ఎత్తివేసే అవకాశం ఉండడంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలన యంత్రాంగం, జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు.

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయు గుండం సోమవారం తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఉత్తరాంధ్రలోని నర్సాపూర్‌–విశాఖపట్నం మధ్య కాకినాడకు దగ్గరలో మంగళవారం తెల్లవారుజామున తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించింది. ఆ సమయంలో గరిష్టంగా గంటకు 
75 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని అంచనావేసింది. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో చాలాచోట్ల మోస్తరు వానలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

మరిన్ని వార్తలు