హెటిరో పార్థసారథిరెడ్డి 5 కిలోల బంగారం విరాళం
మంత్రి హరీశ్రావు కిలో.. ఎంపీ, ఎమ్మెల్యేలు 7 కిలోలు..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చూపిన స్ఫూర్తితో యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం హెటిరో సంస్థ చైర్మన్ పార్థసారథిరెడ్డి తన కుటుంబం తరఫున 5 కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అలాగే, సిద్ధిపేట నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి హరీశ్రావు కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. టీఆర్ఎస్కు చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్కుమార్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు ఎ.గాంధీ, ఎం.హన్మంతరావు, ఎం.కృష్ణారావు, కేపీ వివేకానంద్ తమ కుటుంబాల తరఫున ఏడు కిలోల బంగారాన్ని ఆలయానికి అందించనున్నారు.
ఏపీ నుంచి జడ్పీటీసీ..
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విమాన గోపుర స్వర్ణ తాపడం పనుల కోసం కిలో బంగారాన్ని విరాళంగా వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాపారవేత్త, చిన్న మండెం జెడ్పీటీసీ మోడెం జయమ్మ ప్రకటించారని ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆమె ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని పేర్కొంది. ’ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని జయమ్మ పేర్కొన్నట్టు సీఎంఓ తెలిపింది.