తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ

23 Jun, 2021 17:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా  విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా హైకోర్టుకు వివరాలు సమర్పించారు. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు మూడు రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని సుల్తానియా తెలిపారు. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్‌ బోధన కూడా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

విద్యాసంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. అయితే పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టు అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దీంతో వారంలోగా పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది.

చదవండి: TS: కరోనా చికిత్స, టెస్ట్‌ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం

మరిన్ని వార్తలు