కరోనా పరీక్షలపై తెలంగాణ సర్కార్‌కు సూటిప్రశ్న

24 Sep, 2020 14:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌కు సంబంధించిన వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర కరోనా పరీక్షలు చేస్తున్నారని, రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని మరో మారు ప్రశ్నించింది. కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో తెలపాలని ఆదేశించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు ఎందుకు లేవని, మిగతా రాష్ట్రాల కన్నా ఎందుకు వెనకబడి ఉన్నారో తెలపాలంది.  

వెయ్యి మందికి కనీసం మూడు బెడ్లు కూడా లేక పోవడానికి కారణాలు, ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ బెడ్లు పెంచే ప్రణాళికలు ఉన్నాయో లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్ రావు తండ్రి కరోనాతో మరణించినందున నివేదిక సమర్పించేందుకు గడువు సమయం ఇవ్వాలని ఏజీ కోరగా.. హైకోర్టు విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. (చర్ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్‌)

రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వండి : హైకోర్టు
న్యాయవాది గోపాల్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. గురువారం అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంపై విచారణ జరిపింది. రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్టోబరు 14లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణ 15కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు