నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత

1 Jul, 2021 14:47 IST|Sakshi

సాక్షి,నల్గొండ: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగర్‌ జలవిద్యుత్‌ కేం‍ద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిని ఆపాలంటూ ఏపీ అధికారులు గురువారం మెమొరాండం ఇవ్వడానికి వచ్చారు. కాగా తెలంగాణ పోలీసులు ఏపీ అధికారులను సాగర్‌ బ్రిడ్జిపైనే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సాగర్‌ రైట్‌ కెనాల్‌ ఎస్‌ఈ గంగరాజు ఆధ్వర్యంలోని ఏపీ అధికారుల బృందం ఇచ్చిన మెమొరాండంను తెలంగాణ జెన్‌కో అధికారులు తిరస్కరించారు. ఫ్యాక్స్‌లో లేఖ పంపాలంటూ ఏపీ అధికారులతో పేర్కొన్నారు. దీంతో వారు అక్కడినుంచి వెనుదిరిగారు. 

ఈ సందర్భంగా రైట్ కెనాల్ ఎస్‌ఈ గంగరాజు మాట్లాడుతూ.. ''విద్యుత్ ఉత్పత్తి కోసం సాగర్ మెయిన్ కెనాల్ ద్వారా.. తెలంగాణ అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు. సాగర్ నుంచి వెళ్లిన నీరు పులిచింతల వద్ద వదిలేయడంతో.. నీరంతా వృథగా సముద్రంలో కలుస్తుంది. మనం ఇంకా వ్యవసాయ సీజన్‌ మొదట్లోనే ఉన్నాం. రైట్ కెనాల్‌ కింద 11 లక్షల 15 వేల ఎకరాల సాగు చేస్తున్నారు.  వచ్చిన నీటిని వచ్చినట్టే వదిలేయడంతో రైతుల ఆశను ఒమ్ము చేస్తున్నారు.  విద్యుత్ ఉత్పత్తి ఆపాలని తెలంగాణ అధికారులకు మెమోరాండం ఇచ్చేందుకు వెళ్లాం. తెలంగాణ పోలీసులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు’’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు