ప్రణాళికాబద్ధంగా పచ్చదనం

9 Nov, 2022 02:26 IST|Sakshi

అందుకే గ్రీన్‌సిటీ అవార్డు వరించింది

ప్రతిష్టాత్మకంగా హరితహారం నిర్వహిస్తున్నాం

హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ప్రణాళికాబద్ధంగా పచ్చదనం పెంచుతున్నామని, భవన నిర్మాణాలకు అనుమతుల సమయంలోనే 25 శాతం గ్రీనరీ ఉండేలా  చర్యలు తీసుకుంటున్నామని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ తెలిపారు. లేఅవుట్లకు అనుమతి­చ్చిన తర్వాత నిర్ణీత స్థలంలో గ్రీన్‌జోన్‌ను అభివృద్ధి చేసిన తరువాతే తుది అనుమతులను ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్‌ అసో­సి­యేషన్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ ప్రొడ్యూసర్స్‌ (ఏఐపీహెచ్‌) ఆధ్వర్యంలో గ్రీన్‌ సిటీపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఏఐపీహెచ్‌ గ్రీన్‌ సిటీ కమిటీ   ప్రతినిధి బిల్‌ హార్డీ అధ్యక్షతన ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సమావేశంలో... హైదరాబాద్‌ నగరా­నికి ప్రతిష్టాత్మక గ్రీన్‌సిటీ అవార్డు లభించడం వెనుక ఉన్న కృషిని అరవింద్‌ వివరించారు. హైదరాబాద్‌ నగరంలో 150 చెరువులను సుందరీకరణ చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ చుట్టూ 16 అటవీ ప్రాంతాల్లో అర్బన్‌ఫారెస్టు పార్కు­లు అభివృద్ధి చేసి పట్టణ ప్రాంత ప్రజ­లకు అందుబాటులోకి తెచ్చామన్నారు.

మహా­న­గరం చుట్టూ 158 కి.మీ. మేర ఉన్న ఔటర్‌ రింగు రోడ్డులో పచ్చదనం పెంపొందించి గ్రీన్‌ జోన్‌గా మార్చామని తెలిపారు. ఫార్ములా ఈ ట్రాక్‌ నిర్మాణంలో కోల్పోతున్న చెట్లను పూర్తిగా మరో చోటుకు తరలించి ట్రాన్స్‌లొకేట్‌ చేస్తు­న్నట్లు అరవింద్‌కుమార్‌ వివరించారు. ప్రతియే­టా ‘హరితహారం’ కార్య­క్రమాన్ని ఎంతో ప్రతి­ష్టాత్మకంగా నిర్వహి­స్తున్నట్లు చెప్పారు. కోట్లాది మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తూ పచ్చద­నాన్ని అభివృద్ధి చేసిన తీరును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. 

మరిన్ని వార్తలు