Telangana: తుపాకులకు హోంశాఖ రెడ్‌ సిగ్నల్‌! 

24 Nov, 2022 12:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఫారెస్ట్‌ రేంజ్, ఇతర అధికారులకు ఆయుధాలివ్వాలనే ప్రతిపాదనను గతంలోనే అటవీశాఖ నిశితంగా పరిశీలించింది. ఇందుకోసం బడ్జెట్‌ కేటాయింపుతో పాటు, తమ అవసరాలకు తగ్గట్టుగా ఏ రకమైన ఆయుధాలు కావాలి అన్న దానిపైనా అధ్యయనం జరిపారు. సెల్ప్‌ లోడింగ్‌ రైఫిల్స్‌ (ఎస్‌ఎల్‌ఆర్‌) కోసం తయారీదారులను సంప్రదించే వరకు ప్రయత్నాలు జరిగాయి.

ఈ మేరకు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి చేరాక.. హోంశాఖ అభిప్రాయం కోసం పంపించారు. అయి తే హోంశాఖ ఇందుకు నిరాకరించినట్లు అటవీ అధికారవర్గాల సమాచారం. అటవీ ప్రాంతాల్లోని అధికారులకు ఆయు« దాలు అందజేస్తే అవి  తీవ్రవాదులు, నక్సలైట్లు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో పడే ప్రమాదముందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

పోలీసుల సహకారం తీసుకోండి.. 
అటవీ అధికారులకు పోలీస్‌ స్టేషన్‌ మాదిరిగా ఒక స్టేషన్, ఆయుధాలు భద్రపరిచే ‘బెల్‌రూమ్‌’వంటివి లేకపోవడాన్ని ప్రస్తావించినట్టు చెబుతున్నారు. అదీగాక ఆయుధాలను ఉపయోగించడంలో అటవీ అధికారులకు పూర్తిస్థాయి శిక్షణ లేకపోవడాన్ని కూడా హోంశాఖ ఎత్తిచూపినట్టు తెలుస్తోంది. ఏవైనా ఘటనలు జరిగితే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచిస్తూ ఈ ప్రతిపాదనను అటకెక్కించినట్లు సమాచారం.
చదవండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!    

మరిన్ని వార్తలు