భక్త జన యాదాద్రి

14 Nov, 2022 02:22 IST|Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణలోని నలుమూలల నుంచి, వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీస్వామిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. వీఐపీ దర్శనం కోసం రూ.150 టికెట్‌ కొనుగోలు చేసిన భక్తులు తూర్పు రాజగోపురం నుంచి పడమటి రాజగోపురం వరకు క్యూకట్టారు.

ఈ టికెట్‌ కొనుగోలు చేసిన భక్తులకు 2 గంటల సమయం పట్టింది. ఇక ధర్మదర్శనం కోసం మూడు కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి వీరికి 5 గంటలకు పైగా సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 50వేల మంది వరకు భక్తులు దర్శించుకున్నారు. ప్రసాదం కొనుగోలు చేయడానికి భక్తులు అధికంగా ఆసక్తి చూపారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు నిత్యాదాయం సైతం రికార్డు స్థాయిలో వచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఒక్క రోజే శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.1,09,82,446 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు