Hyderabad: ‘సిటీ’జనులకు షాక్‌..! బస్‌ పాస్‌ చార్జీలు భారీగా పెంపు

25 Mar, 2022 15:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్నిరకాల బస్‌పాస్‌ చార్జీలను ఆర్టీసీ పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. జనరల్‌ బస్‌ టికెట్‌ (జీబీటీ) పాసులు భారీగానే పెరిగాయి. ఈ కేటగిరీలో ఆర్డినరీ పాస్‌ చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెరిగింది.

ఎన్‌జీఓ బస్‌పాస్‌లకు సంబంధించి.. ఆర్డినరీ పాస్‌ చార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్‌–ఆర్టీసీ కోంబో టికెట్‌ చార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది. ఇటీవలే సేఫ్టీ సెస్‌ పేరుతో టికెట్‌పై రూపాయి పెంచి, చిల్లర సమస్య రాకుండా ధరను రౌండాఫ్‌ చేయటంతో గరిష్టంగా టికెట్‌ ధర రూ.5 మేర పెరిగింది. గతం లో రౌండాఫ్‌ ధర కాస్త ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో దాన్ని తగ్గించిన ఆర్టీసీ మళ్లీ పాత ధరలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. తాజాగా బస్‌పాస్‌ చార్జీలను సవరించింది. అసలైన ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదన ప్రస్తుతం సీఎం వద్ద పెండింగులో ఉంది. ఆయన అనుమతిస్తే అవి కూడా పెరగనున్నాయి. 

మరిన్ని వార్తలు