మానవత్వం చాటుకున్నఉపాధ్యాయురాలు..

17 Aug, 2021 08:17 IST|Sakshi

సాక్షి, నార్నూర్‌(ఆసిఫాబాద్‌): ప్రభుత్వం కరోనా ప్రారంభం నుంచి విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు వినిపిస్తోంది. టీవీ లేదా సెల్‌ఫోన్‌లో టీశాట్‌ ద్వారా వచ్చే పాఠాలను విద్యార్థులు వింటున్నారు. ఈ చిన్నారులకు ఏదైనా సందేహాలు నివృత్తి చేసుకుందామంటే అవకాశం ఉండదు. ఇలాంటి సమస్యలు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో ఎక్కువ. గాదిగూడ మండలంలోని డొంగర్‌గావ్‌ గ్రామంలో ఎంపీపీ ప్రభుత్వ పాఠశాల ఉంది.

పాఠశాలలో దాదాపు 40 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అక్కడ 2020 నుంచి దుర్వా విజయశ్రీ గిరిజన ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తోంది. కరోనాతో ప్రభుత్వం పాఠశాలలో ప్రత్యక్ష బోధన రద్దు చేయగా ఆన్‌లైన్‌ పాఠాలు వినాల్సిన పరిస్థితి. అయితే గ్రామంలో అందరూ నిరుపేద విద్యార్థులే. ఎవరి ఇంట్లో టీవీ లేదు. గమనించిన ఉపాధ్యాయురాలు సొంత ఖర్చులతో రూ.20వేలతో టీవీతో పాటు సెటాప్‌ బాక్స్‌ పాఠశాలలో బిగించింది. టీవీ ద్వారా ప్రతి రోజు పాఠశాలలో విద్యార్థులకు విద్యను బోధిస్తోంది.

విద్యార్థుల భవిష్యత్తు కోసమే.. 


కరోనా సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల దయనీయ పరిస్థితిని ప్రత్యక్షంగా చూశాను. నేను విధులు నిర్వహించే డొంగార్‌గావ్‌ గ్రామంలో ఒక ఇంట్లో కూడా టీవీ లేదు. ఆన్‌లైన్‌ పాఠాలు కూడా వినలేని పరిస్థితి. విద్యార్థులు టీవీలో పాఠాలు చూడటం కంటే ప్రత్యక్షంగా చెప్పే పాఠాలు బాగా అర్థం అవుతాయని భావించా. అందుకే వారి ఆర్థిక పరిస్థితి, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నా సొంత ఖర్చుతో టీవీ, సెటాప్‌బాక్స్‌ పాఠశాలలో బిగించి విద్యార్థులకు ప్రతి రోజు పాఠాలు బోధిస్తున్నాను.

– దుర్వా విజయశ్రీ, ఉపాధ్యాయురాలు, డొంగర్‌గావ్, గాదిగూడ   

మరిన్ని వార్తలు