భార్య ఆత్మహత్య తట్టుకోలేక భర్త బలవన్మరణం.. అనాథలైన ముగ్గురు పిల్లలు

18 Nov, 2022 17:14 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక భర్త సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం భవానికుంట తండాకు చెందిన స్వర్ణకు జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం సీత్యతాండాకు చెందిన బానోత్‌ మురళి(30)కి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఐషు, అమ్ములు, అభిరామ్‌ ఉన్నారు.

వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మురళి మద్యానికి అలవాటు పడ్డాడు. క్రమంగా తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. తాగుడు మానాలని భార్య స్వర్ణ ఎంత చెప్పినా వినలేదు. ఈ క్రమంలో అటు కుటుంబ బాధ్యతలు పెరగడం, భర్త మద్యానికి బానిసై మాట వినకపోడంతో విసుగు చెందిన స్వర్ణ ఈనెల 14న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

మత్తు వీడిన తర్వాత భార్య ఆత్మహత్యను తట్టుకోలేక గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో పురుగుల మందు తాగి మురళి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో పసి పిల్లలు అనాథలుగా మారారు.

మరిన్ని వార్తలు