బ్యాంకు ఉద్యోగంపై బదిలీ.. ఇద్దరు పిల్లలున్నా అక్కడ మరో వ్యక్తితో..

14 Nov, 2022 07:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చైతన్యపురి: కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో మనస్తాపానికి లోనైన ఆమె భర్త పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌ పీఅండ్‌టీ కాలనీకి చెందిన శేఖర్‌ (36)కు మల్కాజ్‌గిరికి చెందిన నాగాంజలితో 2014లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. హైదరాబాద్‌లోని కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న నాగాంజలి ఏడాది క్రితం డీజీఎంగా ఆదిలాబాద్‌కు బదిలీపై వెళ్లింది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో  ఆమెకు నాబార్డ్‌లో పనిచేసే తేజ స్వరూపరెడ్డితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ ఫోన్‌లో వీడియోకాల్‌తో మాట్లాడుతుండటాన్ని గుర్తించిన ఆమె భర్త శేఖర్‌ నిలదీయగా తప్పు ఒప్పుకుని మరోసారి తప్పుచేయనని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చింది. 

అయితే, అందుకు భిన్నంగా ఆదిలాబాద్‌లో నాగాంజలి, స్వరూపారెడ్డి సహజీవనం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ వెళ్లినప్పటి నుంచి తనను పట్టించుకోవటం లేదని, పిల్లలను కూడా చూపించటం లేదని భర్త శేఖర్‌ మనస్తాపానికి లోనయ్యాడు. ఫోన్‌ చేస్తే నీచంగా  మాట్లాడింది. అంతేకాక ఆదిలాబాద్‌లో శేఖర్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత భర్తను దుర్భాషలాడటంతో మనస్తాపానికి లోనైన అతను ఈనెల 8న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. 

కాగా,అంతకు ముందుకు అతను భార్య ప్రవర్తనపై సెల్ఫీ వీడియో  తీసుకున్నట్లు గుర్తించారు. శనివారం రాత్రి మృతుడి తండ్రి శరభయ్య ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు. తమ కుమారుడు ఆత్మహత్యకు కారణమైన కోడలు నాగాంజలి, ఆమె తల్లిదండ్రులు, ప్రియుడు స్వరూపరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని,  నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక  బృందాన్ని ఆదిలాబాద్‌ పంపించినట్లు పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు