Hyderabad: భార్యపై అనుమానం.. నిత్యం గొడవలు.. కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి..

11 Nov, 2022 15:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనుమానమే పెనుభూతమై కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడో వ్యక్తి. ఈ  సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. జనగాం జిల్లా కొడవటూరు గ్రామానికి చెందిన బండ రాజు (38), బండ కవిత (34) దంపతులు జవహర్‌నగర్‌లో నివాసముంటున్నారు. రాజు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె జ్యోతి ఇంటర్‌ చదువుతుండగా కుమారుడు పదోతరగతి చదువుతున్నాడు. కాగా  కొన్ని రోజులుగా  దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి.

భార్యపై అనుమానం పెంచుకున్న రాజు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మా ఇద్దరి శవాలను తీసుకెళ్లండి అని సమాచారం అందించాడు. భయపడ్డ కుటుంబసభ్యులు ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో  అనుమానం వచ్చి ఇంటికి వచ్చారు. గడ్డపారతో డోర్‌ పగులగొట్టి చూసే సరికి రక్తపు మడుగులో కవిత, ఉరివేసుకుని రాజు విగతజీవులుగా కనిపించారు. భార్యను అతికిరాతకంగా కట్టర్‌తో గొంతు కోసి హత్యచేసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు బావిస్తున్నారు.

ఘటనా స్థలానికి మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఇంచార్జ్‌ ఏసీపీ విజయ్‌ శ్రీనివాస్, సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు  అనిల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ చేరుకుని ఆధారాలు సేకరించి, మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి  కేసు దర్యాప్తు చేస్తున్నారు.  ఇదిలా ఉండగా తల్లిదండ్రులిద్దరూ మృతిచెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పిల్లలు ఇంటికి వచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో, తండ్రి ఉరివేసుకుని విగతజీవులుగా పడి ఉండడంతో పిల్లల రోదనలు మిన్నంటాయి.   
చదవండి: Nizam College: విద్యార్థుల నిరసన.. తలనొప్పిగా సర్కార్‌ ఉత్తర్వులు

మరిన్ని వార్తలు