తనిఖీలు చేస్తున్నారని భార్యను వదిలేసి భర్త పరార్‌

11 Jan, 2021 08:26 IST|Sakshi

హైదరాబాద్‌: తాగి వాహనాలను నడిపే వారిని పోలీసులు తనిఖీ చేస్తే అది డ్రంకెన్‌ డ్రైవ్‌!..మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసుల్ని చూసి పరుగందుకుంటే అది డ్రంకన్‌ రన్‌!!..శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పట్టణంలో డ్రంకెన్‌ రన్‌ ఘటనే జరిగింది. ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిపోతానేమోనని ఓ ప్రబుద్ధుడు బండితో పాటు భార్యను కూడా నడిరోడ్డుపై వదిలేసి పరారయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్‌లోని తొండుపల్లి వద్ద స్థానిక ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో షాద్‌నగర్‌ నియోజకవర్గం నందిగామకు చెందిన రాజు మద్యం తాగి బైక్‌పై తన భార్యను తీసుకెళ్తున్నాడు. తనిఖీలు చేస్తున్న పోలీసులను దూరం నుంచే గమనించిన రాజు బండిని, భార్యను అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీంతో ఏం చేయాలో తెలీక భార్య అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోవడంతో..పోలీసులు ఆమె దగ్గరకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కుటుంబసభ్యులకు సమాచారం అందించి ఇంటికి పంపించారు. (భార్యను బస్సెక్కించి..)


 

>
మరిన్ని వార్తలు