వివాహమై 30 ఏళ్లు.. మరో మహిళను పెళ్లి చేసుకుని..

1 Aug, 2021 08:13 IST|Sakshi
కారేపల్లి పోలీసు స్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న బాధితురాలు

సాక్షి,కారేపల్లి(ఖమ్మం): భర్త నుంచి తనకు ఆస్తి పంచి ఇవ్వాలని.. తన కూతురుతో కలిసి ఓ మహిళ కారేపల్లి పోలీసు స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మాధారం గ్రామానికి చెందిన చిలక సాంబశివరావుకు 30 ఏళ్ల క్రితం సీతమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కృష్ణవేణి ఉంది. కాగా సాంబశివరావు మరో మహిళను రెండో వివాహం చేసుకొని, తనను, తన కూతురిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని వాపోయింది. ఇంట్లో గానీ, వ్యవసాయ భూమిలో గానీ ఆస్థి పంచి ఇవ్వలేదని, ఈ విషయమై పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపించింది.

ఈ విషయమై.. ఎస్‌ఐ సురేష్‌ను వివరణ కోరగా..
సీతమ్మ తన భర్త నుంచి ఆస్థి పంచి ఇవ్వాలని.. పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసిందని, ఇది సివిల్‌ మ్యాటర్‌ అని కోర్టు ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా సీతమ్మ పోలీసు స్టేషన్‌కు వస్తూ.. ఎస్‌ఐలు మారినప్పుడల్లా ఇదే విషయంపై సీతమ్మ ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసిందని, కోర్టు ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సీతమ్మకు చెప్పామన్నారు.  

మరిన్ని వార్తలు