నిన్న రోడ్డెక్కిన తండ్రి.. నేడు చెట్టెక్కిన కొడుకు 

15 Jun, 2021 08:23 IST|Sakshi

అన్నం పెడతలేరు  అంటూ తండ్రి నిరశన.. 

తనను బద్నాం చేస్తున్నాడంటూ కొడుకు నిరసన

వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపిన హుస్నాబాద్‌ పోలీసులు 

హుస్నాబాద్‌: తండ్రీకొడుకులు రోడ్డెక్కారు. ఆకలిబాధతో అలమటిస్తున్నానని తండ్రి అంటుండగా, అదేం కాదు, అనవసరంగా బద్నాం చేస్తున్నాడని కొడుకులు అంటున్నారు. తండ్రి నిరాహారదీక్ష చేపట్టగా, తండ్రి వైఖరిని నిరసిస్తూ కొడుకు చెట్టెక్కి ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చర్చనీయాంశమైంది. హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన కొత్తకొండ స్వామికి ఇద్దరు కొడుకులు. కొడుకులను పెంచి పోషించి ప్రయోజకులుగా చేసి, ఆస్తులు కూడబెట్టి ఇచ్చినా.. బుక్కెడు బువ్వ పెట్టడం లేదని తండ్రి ఆదివారం ఆమరణ దీక్ష చేట్టారు.

ఈ నేపథ్యంలో తమను కావాలనే అభాసుపాలు చేస్తున్నాడని పెద్ద కొడుకు సంతోష్‌ తమ ఇంటి ముందున్న చెట్టెక్కాడు. విషయం తెలుసుకుని వచ్చిన ఎస్‌ఐ శ్రీధర్‌ సర్దిచెప్పడంతో సంతోష్‌ కిందికి దిగివచ్చాడు. స్వామి, ఆయన కొడుకులు సంతోష్, సుధాకర్‌ను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. ఆస్తి పంపకాలు, ఇతర సమస్యలను తామే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని ఒప్పుకున్నారని ఎస్‌ఐ తెలిపారు.
 

మరిన్ని వార్తలు