పోలీసులపై ఎంపీ అరవింద్‌ ఆగ్రహం

10 Mar, 2021 07:48 IST|Sakshi
పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఎంపీ అరవింద్‌

సాక్షి, బంజారాహిల్స్‌: ‘నన్ను ఆపడానికి మీరెవరంటూ’ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాను భైంసాకు వెళ్తున్నట్లు సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ట్వీట్‌ చేశారు. దీంతో అప్రమత్తమైన బంజారాహిల్స్‌ పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరవింద్‌ను అడ్డుకునేందుకు ఇంటి వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే ఆయన వెళ్లిపోయినట్లు తెలియడంతో బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌. కళింగరావు, ఎస్‌ఐలు బాలరాజు, కె.ఉదయ్‌తో పాటు పోలీసులు పెట్రోకార్లలో ఆయనను వెంబడించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని పార్క్‌హయత్‌ హోటల్‌ ముందు నుంచి వెళ్తున్న ధర్మపురి అరవింద్‌ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన పోలీస్‌ పెట్రోకార్లు రోడ్డుకు అడ్డంగా నిలిపి అడ్డుకున్నారు.

దీంతో కారులో నుంచి దిగిన అరవింద్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఆపడానికి మీరెవరంటూ పోలీసులను నిలదీయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాను నిజామాబాద్‌  వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు. హిందువులను నాశనం చేయాలనుకున్నారా.. తమాషా చేస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో సహకరించాలని  ఇన్‌స్పెక్టర్‌ విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. నిజామాబాద్‌ వెళ్తుంటే వద్దని చెప్పేందుకు ఆర్డర్‌ ఏదంటూ నిలదీశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా  అరెస్ట్‌ చేసే అధికారం తమకు ఉందని పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

చదవండి: 
నల్లధనం తేలేదు.. నల్ల కుబేరులను దేశం దాటించారు
15 నుంచి తెలంగాణ బడ్జెట్‌ అసెంబ్లీ

మరిన్ని వార్తలు