కానిస్టేబుల్‌ దురుసు ప్రవర్తన..సీపీ  చర్యలు

31 May, 2021 11:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గౌలిపురా: భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ కె.ఎన్‌.శివ కుమార్‌పై వేటు పడింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు వాహనదారునిపై దురుసుగా ప్రవర్తించడంతో కానిస్టేబుల్‌ కె.ఎన్‌.శివ కుమార్‌పై నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. శనివారం రాత్రి తలాబ్‌కట్టా రోడ్డులో బందోబస్తు నిర్వహిస్తున్న కె.ఎన్‌.శివ కుమార్‌కు ఓ వాహనదారుడితో వాగ్వాదం జరిగింది.

ఇరువురి మధ్య వాదోపవాదం తీవ్రస్థాయికి చేరడంతో పాటు వాహనదారుని ఎడమ కన్నుకు గాయమైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆందోళన నిర్వహించడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సంఘటనపై విచారణ చేపట్టిన అధికారులు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు.

చదవండి: బురిడీ బాబాల నిర్వాకం: పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి

మరిన్ని వార్తలు