హైదరాబాద్‌ ప్రజలకు ఊపిరి ఆడట్లే.. కారణాలివే!

20 Jun, 2022 17:12 IST|Sakshi

మార్చి–జూన్‌ మధ్యకాలంలో ‘భూస్థాయి ఓజోన్‌’ తీవ్రత అధికం

పెరుగుతోన్న శ్వాసకోశ వ్యాధులు

మెట్రో నగరాల్లో గ్రేటర్‌ది నాలుగోస్థానం

సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ తాజా నివేదికలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో ట్రాఫిక్‌ రద్దీలో వాహనాలు వదులుతోన్న కాలుష్యంతో గ్రేటర్‌లో ‘భూస్థాయి ఓజోన్‌ (పొగ కారణంగా విడుదలయ్యే వాయువు)’ మోతాదు ఈ ఏడాది మార్చి–మే మధ్యకాలంలో అనూహ్యంగా పెరిగింది. మూడు నెలల్లో సుమారు 43 రోజులపాటు భూస్థాయి ఓజోన్‌ మోతాదు పరిమితులు దాటింది. దీంతో ఆస్తమా, బ్రాంకైటిస్‌ తదితర శ్వాసకోశ వ్యాధులతో సతమతమయ్యే వారి సంఖ్య పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ గత మూడేళ్లుగా వేసవిలో భూస్థాయి ఓజోన్‌ మోతాదుపై ఆరు నగరాల డేటాను పరిశీలించింది. ఇందులో ఢిల్లీ, ముంబయి, కోల్కతా మెట్రో నగరాలు మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో గ్రేటర్‌ సిటీ నాలుగోస్థానంలో నిలవడం గమనార్హం.  

వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్‌ వాయువులు సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై ఓజోన్‌ వాయువు గాలిలోని నైట్రోజన్‌ ఆక్సైడ్స్, ఓలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్, కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్‌ డయాక్సైడ్‌లతో కలియడంతోపాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్‌ దట్టంగా ఆవహించిందని పేర్కొంది. దీంతో ట్రాఫిక్‌ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడని పరిస్థితిని ఎదుర్కొన్నట్లు స్పష్టంచేసింది.  

సాధారణంగా ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్‌ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు.. కానీ నగరంలోని ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 120 మైక్రోగ్రాములుగా నమోదయినట్లు ఈ నివేదిక వెల్లడించింది.  
చదవండి: బంజారాహిల్స్‌: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీలు

భూస్థాయి ఓజోన్‌తో తలెత్తే అనర్థాలివే... 
►అస్తమా, బ్రాంకైటిస్‌తో సతమతమవడంతోపాటు ఊపిరాడని పరిస్థితి 
►గొంతు నొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం. 
►ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతిలో అసౌకర్యం.  

కట్టడి ఇలా.. 
►ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్క్‌లు, హెల్మెట్‌లు ధరించాలి. 
►కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా వాయుకాలుష్యం, భూస్థాయి ఓజోన్‌ వల్ల కలి గే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు.   
►కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూడాలి. 
►గ్రేటర్‌ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థను సిటీజన్లు వినియోగించుకోవాలి. 
►పతీ వాహనాని కి ఏటా పొల్యూషన్‌ చెక్‌ పరీక్ష లను తప్పనిసరి చేయాలి. ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు వేయాలి. 
►ఇరుకు రహదారులు, బాటిల్‌నెక్స్‌ను తక్షణం విస్తరించాలి. 

మరిన్ని వార్తలు