మీ వాహనంపై ట్రాఫిక్‌ చలానా ఉందా? అయితే, బండి సీజ్‌!

4 Aug, 2021 08:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కొరడా ఝళిపించేందుకు సైబరాబాద్‌ పోలీసులు సిద్ధమయ్యారు. చలానాలు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గ్రేటర్‌ పరిధిలో ఉన్న వాహనాలపై ఒక్క ట్రాఫిక్‌ చలానా పెండింగ్‌లో ఉన్నా.. వాహనాన్ని సీజ్‌ చేస్తామని సైబరాబాద్‌ పోలీసులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. 

ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా గతంలో మూడు చలానాలు పెండింగ్‌లో ఉంటే  వాహనం సీజ్‌ చేసేవారు. అయితే గతేడాది సైబరాబాద్‌ పరిధిలో 47.83 లక్షల కేసుల్ని నమోదు చేసిన పోలీసులు రూ.178.35 కోట్ల జరిమానా విధించారు. కానీ ఉల్లంఘనులు రూ.30.32 కోట్లు మాత్రమే చెల్లించారు. దీంతో సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ జరిమానాలు కట్టిస్తున్నారు. లేదంటే వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు