చైన్‌ స్నాచింగ్‌ అంటూ హైడ్రామా.. కథ భలే అల్లింది!

29 Jun, 2021 09:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హిమాయత్‌నగర్‌: తన చైన్‌ స్నాచింగ్‌ అయిందంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు అలర్ట్‌ అయ్యారు. గంటలోపే ఆమె చెప్పింది కట్టుకథని అని తేల్చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...దోమలగూడ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఓ మహిళ జ్యువెలరీస్‌లో హౌస్‌ కీపర్‌గా పనిచేస్తుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు పని పూర్తి చేసుకొని తెలుగు అకాడమీ లేన్‌లో నుంచి నడుచుకుంటూ వస్తుండగా రాంగ్‌రూట్‌లో బైక్‌పై వచ్చి ఇద్దరు యువకులు.. ఓ అడ్రస్‌ చెప్పమని అడుగుతూ తన మెడలోని మూడు తులాల బంగారపు పుస్తెల తాడును లాక్కుని పరారైనట్లు పోలీసులకు ఆమె తెలిపింది.

అయితే, సీసీ కెమెరా ఫుటేజీలను గమనించిన నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ భపతి గట్టుమల్లు ఆమె చెప్పేది కట్టుకథ అని, ప్లాన్‌ ప్రకారమే ఇదంతా చేసిందని గుర్తించారు. ఆమెను ప్రశ్నించగా.. చేసిన తప్పును ఒప్పుకుంది. డబ్బులు అవసరం కావడంతో తనతో పనిచేసే ఓ వ్యక్తికి పుస్తెల తాడును కుదవ పెట్టమని ఇచ్చానని, రెండు, మూడు రోజుల్లో కుదవ పెట్టి రూ.30వేలు తెస్తానని మాట ఇచ్చాడని చెప్పింది. డబ్బులు ఆలస్యం అవుతుండటంతో తన అవసరాన్ని తీర్చుకోవడానికి ఈ కట్టుకథ అల్లిందని ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు వెల్లడించారు.

చదవండి: మరియమ్మ కుమారుడికి ఉద్యోగం, రూ.35 లక్షల చెక్కు

>
మరిన్ని వార్తలు