అతివేగంతో పల్టీలు కొట్టిన కారు.. కేసు వద్దని ఎమ్మెల్యేల ఒత్తిడి!

10 Apr, 2021 08:18 IST|Sakshi
పల్టీలు కొట్టిన కారు

ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

మద్యం మత్తులో కారు నడిపినట్లు సమాచారం  

సాక్షి, లంగర్‌హౌస్‌: మద్యం మత్తులో కారు వేగంగా నడపగా.. అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేల ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేసి ప్రమాదాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. మలక్‌పేట్‌లో నివాసముండే రషీద్‌ఖాన్‌(19) విద్యార్థి. స్నేహితులతో మద్యం తాగి వోక్స్‌ వ్యాగన్‌ పోలో(ఎపి 29బిపి 3444) కారులో అర్ధరాత్రి దాటాక ముగ్గురు స్నేహితులతో కలిసి లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ ముందు నుంచి రింగ్‌ రోడ్డు వైపు వేగంగా వెళ్తున్నారు.

మొఘల్‌నగర్‌ రింగ్‌ రోడ్డు పీవీ నర్సింహరావు ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నెంబర్‌–100 వద్దకు రాగానే కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. డ్రైవింగ్‌ చేస్తున్న రషీద్‌ఖాన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేయవద్దని ఇద్దరు పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి రావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ వివరాలను గోప్యంగా ఉంచే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు.

చదవండి: పల్టీలు కొట్టిన పోలీస్‌ వాహనం
గంటకు 140 కిమీ వేగం.. అందుకే ప్రమాదం

మరిన్ని వార్తలు